ఆ పాముకి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు.. గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు
పామును పల్లకిపై ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. దారిపొడవునా భక్తులు పూలు, పసుపు నీళ్లతో అభిషేకించారు.
26 రోజులుగా గ్రామస్తుల పూజలు అందుకోని.. అకస్మాత్తుగా చనిపోయిన పాముకి దుర్గాడ గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో ఇటీవల ఓపాము కనపడిన సంగతి తెలిసిందే. ఆ పాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలుస్తూ గ్రామస్తులు పూజలు కూడా నిర్వహించారు. అనూహ్యంగా పాము రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా కన్నుమూసింది.
ఈ మేరకు గ్రామస్తులు, సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సర్పానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శివాలయం నుంచి పామును పల్లకిపై ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. దారిపొడవునా భక్తులు పూలు, పసుపు నీళ్లతో అభిషేకించారు. గ్రామస్తుడు ఆకుల వీరబాబు పొలంలో ఉంచి పూజలు చేశారు. పండితులు శాస్త్రోక్తంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించి, ఖననం చేశారు.
కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాము ఖననం జరిగిన ప్రదేశంలో పసుపు, కుంకుమ, విభూది చల్లి పూజలు చేశారు. మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పన మోహనరావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పూజలు నిర్వహించారు. ఆయన వెంట మల్లాం సర్పంచి కొప్పన శివానాథ్ తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఆలయ నిర్మాణ పనులు కూడా ప్రారంభించేశారు. ఇప్పటికే ఒకరు ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వగా.. కొందరు విరాళాలు అందజేస్తున్నారు.