మచిలీపట్నంలో తాగుబోతు వీరంగం... పోలీసులపైనే దాడి, ప్రాణాపాయస్థితిలో కానిస్టేబుల్
ఓ తాగుబోతు మద్యం మత్తులో పోలీసులపైనే దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
మచిలీపట్నం: పీకలదాక మందుతాగిన ఓ తాగుబోతు మచిలీపట్నం (machilipatnam)లో నానా హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాదు అడ్డుకున్న పోలీసులపైనే దాడికి దిగాడు. ఇలా తాగుబోతు(drunken man) దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
మచిలీపట్నంకు చెందిన మద్దెల కృష్ణ పెద్ద తాగుబోతు. నిత్యం మద్యం సేవించి ఆ మత్తులో చిల్లరగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందిపెట్టేవాడు. ఇలా ఇవాళ(గురువారం) కూడా మద్యంమత్తులో హంగామా సృష్టిస్తున్నాడంటూ డయల్ 100 కు ఫోన్ కాల్ వచ్చింది.
వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరకుని మత్తులో వున్న కృష్ణను సముదాయించే ప్రయత్నం చేసారు. అయితే కృష్ణ పోలీసుల మాట వినకపోగా వారితోనే గొడవకు దిగాడు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నిస్తుండగా తోపులాట జరిగింది. అ క్రమంలో విచక్షణను కోల్పోయిన తాగుబోతు చేతికందిన ఓ ఇటుకరాయిని తీసుకుని పోలీసులపై దాడికి తెగబడ్డాడు.
read more Visakha Crime: డంబెల్ తో భార్య తలను చితక్కొట్టి... ఉరేసుకుని భర్త ఆత్మహత్య
ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇటుకరాయితో తాగుబోతు బలంగా కొట్టడంతో కానిస్టేబుల్ తల పగిలి తీవ్ర రక్తస్రావమయ్యింది. దీంతో కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని తోటి పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
కానిస్టేబుల్ శ్రీనివాస్ పై తాగుబోతు దాడి గురించి తెలియడంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. వెంటనే సదరు తాగుబోతును అరెస్ట్ చేయాలన్న ఎస్పీ ఆదేశించారు. దీంతో కృష్ణను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.