కన్నకూతురి కోసం... తాగుబోతు అల్లున్ని హతమార్చిన మామ
కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేస్తున్న తాగుబోతు అల్లున్ని పిల్లనిచ్చిన మామనే రాడ్ తో కొట్టిచంపాడు.
గుంటూరు: తాగుడుకు బానిసైన అల్లుడి నిత్యం కూతురిని వేధించడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో క్షణికావేశంలో అల్లున్ని రాడ్ తో కొట్టిచంపాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తాడేపల్లి నులకపేట కు చెందిన దుర్గారావు తన కూతురు లావణ్యను నరేష్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లిచేశాడు. అయితే దురవాట్లకు అలవాటుపడ్డ నరేష్ మద్యం సేవించి ఇంటించి వచ్చి భార్యను వేధించేవాడు. అంతేకాదు నేరాలకు కూడా పాల్పడేవాడు. ఈ క్రమంలోనే జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు.
read more కర్నూల్లో దారుణం: ఇద్దరు టీడీపీ నేతల హత్య
జైలుకు వెళ్లి వచ్చినా నరేష్ బుద్ది మారలేదు. మళ్లీ తాగొచ్చి భార్య లావణ్యపై దాడికి దిగాడు. అక్కడేవున్న ఆమె తండ్రి దుర్గారావు ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. మామా అల్లుడు మధ్య పెనుగులాట జరిగింది. దీంతో ఆవేశానికి లోనయిన దుర్గారావు అల్లుడి తలపై రాడ్ తో బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అతడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.