బందర్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను ప్రకటించారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ . సింహాద్రి చంద్రశేఖర్‌కు దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిగా పేరుంది. దివంగత నేత, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే చంద్రశేఖర్. పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో పాటు అవనిగడ్డలో పట్టుండటంతో సింహాద్రి చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నం నియోజకవర్గం విషయంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహం మార్చారు. బందర్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను ప్రకటించింది. ఈ మేరకు మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం వివరాలు తెలియజేశారు. తొలుత సింహాద్రి చంద్రశేఖర్‌ను అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా.. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ ప్రకటించారు. అయితే వ్యూహం మార్చి చంద్రశేఖర్‌ను బందర్ ఎంపీ బరిలో నిలబెట్టారు. 

ఇకపోతే.. సింహాద్రి చంద్రశేఖర్‌కు దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ వైద్యుడిగా పేరుంది. దివంగత నేత, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే చంద్రశేఖర్. సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అవనిగడ్డ నుంచి 1985, 1989, 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగానూ ఆయన పనిచేశారు. పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో పాటు అవనిగడ్డలో పట్టుండటంతో సింహాద్రి చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. అయితే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అలాంటిది ఈసారి చంద్రశేఖర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంపై దివిసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .