రఘురామను ఏడేళ్లు జెల్లోనే వుంచేలా... జగన్ సర్కార్ కుట్రలు..: డిజిటల్ మహానాడులో చంద్రబాబు
సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ రాకుండా ఉండేవిధంగా ఏడేళ్లు జైలు శిక్ష ఉండేలా సెక్షన్లు పెట్టించి వైసిపి సర్కార్, నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారన్నారు టిడిపి చీఫ్ చంద్రబాబు.
అమరావతి: సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీస్ కస్టడీలోనే దాడి చేశారంటే ఏంటి వారి ధైర్యం? అని వైసిపి సర్కార్ పై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బెయిల్ రాకుండా ఉండే విధంగాఏడేళ్లు జైలు శిక్ష ఉండేలా సెక్షన్లు పెట్టించి వైసిపి నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చివరకు రఘురామ మెడికల్ నివేదకలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టానుసారంగా రాసుకున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీ డిజిటల్ మహానాడు 2021 ఇవాళ(గురువారం) ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కరోనాతో మనందరం భౌతికంగా కలవలేకపోతున్నామన్నారు. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్ భయంకరంగా మారిందని... దానికితోడు బ్లాక్ ఫంగస్ కూడా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు.
''దేశంలో ఎవ్వరూ చేయని విధంగా రెండో డిజిటల్ మహానాడుకు శ్రీకారం చుట్టా. కొన్ని మతాలు, కులాలకు, ప్రాంతాలకు పండుగలు ఉంటాయి. కానీ ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడున్న ఘనంగా జరుపుకునే పండగ ఎన్టీఆర్ జయంతి. తెలుగు జాతి అంటే ప్రపంచం మొత్తానికి మొదటగా ఎన్టీఆరే గుర్తుకు వస్తారు'' అన్నారు.
''ఆత్మ గౌరవమే కాదు ఆత్మ విశ్వాసంతో ముందుకు పోవాలని పిలుపిచ్చాను. సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. కోవిడ్ వచ్చిన తరువాత ప్రపంచంలోనే అనేక పెనుమార్పులకు నాంది పలికింది - సమర్ధవంతంగా పక్కా ప్రణాళికతో ఎదుర్కున్న ప్రభుత్వాలే ఆయా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేవు. కోవిడ్ సోకి తల్లి దండ్రులు చనిపోయి పిల్లలు ఆనాదలయ్యారు. కరోనా సోకిన వ్యక్తులు సగం కరోనాతో మరోసగం భయంతో చనిపోయారు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
''ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ లేని పరిస్థితి రాష్ట్రంలో వుంది. చనిపోయిన కరోనా బాధితులకు అంత్యక్రియులు కూడా చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కున్న పార్టీగా మేము సలహాలు ఇస్తాం, కలిసి పని చేద్దామంటే కనీసం తీసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఏది మాట్లాడినా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుంది. ఒక సారి కరోనా వస్తే చాలా ప్రమాదం ఉంటుంది దానిని కట్టడి చేయలేమని 2020 జనవరిలోనే చెప్పాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పారాసిట్మాల్, బ్లీచింగ్ తో పోతుందని తప్పుడు సంకేతాలు ఇచ్చారు'' అని మండిపడ్డారు.
''తిరుపతి రియా ఆసుపత్రుల్లో 32 మంది చనిపోయారని పేర్లతో సహా ఇస్తే ప్రభుత్వం మాత్రం 11 మంది చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చింది. నేడు మానవ హక్కుల సంఘం పర్యటిస్తుంది కాబట్టి 22 మంది కుటుంబాలకు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది'' అన్నారు.
read more చంద్రబాబు గారు... మనం కూడా ఇంతకు ఇంత చేయాలి: గౌరు దంపతులు
''ఆనందయ్య కరోనా రోగులకు అందిస్తున్న మందు మీద అధ్యయనం చేయకుండా దానిని కూడా స్వార్ధంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎల్లో మీడియా అని అంటున్నారు మరి బ్లూ మీడియా సంగతి ఏంటి? తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు" అని విమర్శించారు.
''4 ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా పెడుతున్నాం. కోవిడ్ పేషెంట్లకు ఆన్ లైన్ టెలీ మెడిసిన్ మీద శ్రద్ధ పెట్టాం. మందులు, ఆహారం సరఫరా చేస్తున్నాం . ఆసుపత్రులను పరిశీలించి కోవిడ్ బాధితులకు ధైర్యాన్ని నింపాలని పిలుపునిస్తే ఎందుకు ప్రభుత్వం భయపడింది'' అని అడిగారు.
''అధికారం ఉందని తప్పుడు కేసులు పెడతారా? సర్వేపల్లి పల్లి ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కాదని ఆనందయ్యతో క్యాంప్ పెట్టించి మందును సరఫరా చేయిస్తే ఆనందయ్యను అరెస్ట్ చేశారు గాని క్యాంప్ పెట్టించిన ఎమ్మెల్యేని ఎందుకు వదిలేశారు? రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం నడుస్తుంది. ఎవరు మాట్లాడితే వారి నోరు మూయించే ప్రయత్నం పోలీసులతో చేయిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. కోర్టులను కూడా ప్రభుత్వం బెదిరిస్తుంటే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది?'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
'' అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దెందలూరి ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, రామకృష్ణా రెడ్డి, బీటెక్ రవి, బీసీ జనార్ధన్ రెడ్డిలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. డాక్టర్ సుధాకర్ చేసిన నేరం ఏంటి? మాస్క్ ఆడిగిన పాపానికి పిచ్చి వాడిని చేసి హింసించి హింసించి చనిపోయేలా చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటు గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వైసీపీ నాయకులు బలిగొన్నారు. కోడెల శివప్రసాద్ ను వేధించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
''రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యం ఉందా? సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. చేయని తప్పులకు మా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చట్ట వ్యతిరేకంగా పని చేసే ఏ వ్యక్తైనా ఏదో ఒక రోజు చట్టపరంగా శిక్షార్హులవుతారు. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి'' అని సూచించారు.
''కోవిడ్ సమయంలో నిత్యావసర ధరలు, ఇంటి పన్నుల, ఆర్టీసీ ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఆర్ధిక సమస్యలు తీవ్రంగా దిగజారిపోతాయి. వీటన్నింటిని ప్రభుత్వం ఆలోచించకుండా కక్షసాధింపు చర్యలకు దిగజారటం సిగ్గుచేటు. ప్రభుత్వం మంచి పాలన చేస్తే ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారు, ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుంది'' అన్నారు.
''రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేడు. టమోటా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆ రైతు బాగున్నాడా? ఇచ్చింది గోరంత చెబుతుంది కొండంత. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. బ్లూ మీడియా కోసం ప్రతి రోజు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ డబ్బుతో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చు'' అని చంద్రబాబు సూచించారు.