అన్నదమ్ముల మధ్య కారు చిచ్చు.. ఆత్మహత్య
మృతుడి దగ్గర దొరికిన సూసైడ్ నోట్ను పోలీసులు ముందు నుంచీ గోప్యంగా ఉంచారు. దీంతో అందులో ఏమి రాశాడు అన్నది తెలియక బంధువుల్లో అయోమయం నెలకొంది.
ఓ కారు.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. అంతేకాదు.. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే దాకా దారితీసింది. అక్కడితో ఆగలేదు.. ఒకరి ప్రాణాలు కోల్పోయేదాకా దారి తీసింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఏలూరు బాపిస్టుపేటలో నివాసముంటున్న ఎండి మహబూబ్ఖాన్, ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పెద్దకుమారుడు ఇబ్రహీంఖాన్, రెండో కుమారుడు మహ్మద్ ఆలీ ఖాన్ తమ కుటుంబాలతో కలిసి తండ్రితో ఉంటుండగా చిన్నవాడైన మూడో కుమారుడు విడిగా వుంటున్నాడు. ఇబ్రహీంఖాన్, మహ్మద్ఆలీఖాన్ ఇద్దరూ కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
రెండునెలల కిందట ఇబ్రహీంఖాన్ కొంత అప్పు చేసి కొత్తకారును కొనుగోలు చేశారు. కిరాయిలకు తిప్పుతుండగా గతనెల 30న టూటౌన్లోని ఓ హోటల్ ముందు పార్కు చేసిన కారు మాయమైంది. దీంతో తన తమ్ముడు అహ్మద్ఆలీఖానే కారును అపహరించాడని ఆయన టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. వారం రోజుల కిందటే తాళం మాయం చేశాడని ఇప్పుడు కారు కూడా దొంగిలించాడని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ్ముడి భార్య రాజ్యలక్ష్మి వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఆ మరునాడే తన భర్తను ఇబ్రహీంఖానే కిడ్నాప్ చేశారని కేసు పెట్టారు. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని కోరారు. దీంతో పోయిన కారు దొరకకపోగా తిరిగి తనపై కిడ్నాప్ కేసు బనాయించటంతో బాధితుడు తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం రాత్రి ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుని వాటర్ ట్యాంక్ ఎక్కి టవల్తో ఉరివేసుకుని మృతిచెందాడు.
మృతుడి దగ్గర దొరికిన సూసైడ్ నోట్ను పోలీసులు ముందు నుంచీ గోప్యంగా ఉంచారు. దీంతో అందులో ఏమి రాశాడు అన్నది తెలియక బంధువుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు కేసును పక్కదారి పట్టిస్తున్నారనే కోణంలో పోలీసుల తీరుపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్లో మొత్తం ఆరుగురు పేర్లు నమోదు చేసినట్లు తెలిసింది. టూటౌన్ సీఐను అడ్రస్ చేస్తూ నోట్ ఉంది.
అయ్యా సీఐ గారు నాకు అన్యాయం జరిగింది. మా తమ్ముడు కారు దొంగిలించాడు. తమ్మడి భార్య నాపై కిడ్నాప్ కేసు పెట్టింది. నా తమ్ముడు, అతని భార్య, వారికి సహకరిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, తమ్ముడి భార్య బంధువులు మరో ముగ్గురిపై కఠినంగా చర్యలు తీసుకోండి. నా చావుకు వారే బాద్యులు అని రాసివుంది. ఈ సందర్భంగా సూసైడ్నోట్లో ఉన్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు.