జగన్ను కలిసిన కిల్లి కృపారాణి.. వైసీపీలో ముసలం
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 28వ తేదీన ఆమె వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 28వ తేదీన ఆమె వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఆమె వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. అయితే.. ఆమె అలా జగన్ తో భేటీ అయ్యారో లేదో.. ఇలా వైసీపీలో ముసలం మొదలయ్యింది.
కిల్లి కృపారాణి వైసీపీలో చేరడాన్ని ధర్మాన ప్రసాదరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న జిల్లా వైసీపీలో కృపారాణి రాకతో వర్గ విభేదాలు తలెత్తాయి. అయితే ధర్మాన వర్గం అసంతృప్తిపై కిల్లి కృపారాణి స్పందించారు. ధర్మాన... తన చేరికపై వ్యతిరేకంగా ఉన్నారా లేరా అనేది తనకు అనవసరం అని చెప్పారు. ధర్మాన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం జిల్లాలో శక్తిమేర కృషి చేస్తానని కిల్లి కృపారాణి స్పష్టం చేశారు.