శ్రీకాకుళం రోడ్డు ప్రమాదం... మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు: డిజిపి సవాంగ్ ఆవేధన
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించడంపై రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుంటూరు: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీస్ వాహనం ప్రమాదానికి గురయి నలుగురు పోలీసులు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు డిజిపి కార్యాలయం ప్రకటించింది. కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
read more శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం: నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం
తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని డిజిపి సవాంగ్ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
''విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబాలకు అండగా ఉంటుంది'' అని డిజిపి సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు.