Asianet News TeluguAsianet News Telugu

అప్పన్న చందనోత్సవం: మంత్రులు కొట్టు, బొత్సలపై భక్తుల ఆగ్రహం

సింహాచలం అప్పన్న చందనోత్సవం  కార్యక్రమంపై  సరైన ఏర్పాట్లు  లేకపోవడంపై  భక్తులు  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.  ఏపీ డిప్యూటీ సీఎం  కొట్టు సత్యనారాయణ,  మంత్రి  బొత్స సత్యనారాయణలపై భక్తులు  మండి పడ్డారు.  

Devvotees  not Satisfied  on  appanna chandanotsavam arrangements lns
Author
First Published Apr 23, 2023, 11:00 AM IST

విశాఖపట్టణం:  సింహాచలం  అప్పన్న చందనోత్సవం  కార్యక్రమంపై  సరైన ఏర్పాట్లు లేకపోవడంపై   భక్తులు  ఆందోళన  వ్యక్తం  చేశారు.  అప్పన్న చందనోత్సవానికి  వచ్చిన  ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు  సత్యనారాయణ, ఏపీ మంత్రి  బొత్స  సత్యనారాయణలపై  భక్తులు  ఆగ్రహం  వ్యక్తం  చేశారు.  ఒకానొక దశలో  భక్తులు  బారికేడ్లు  తోసుకొని  దర్శనం కోసం పరుగులు తీశారు. 

సింహాచలం  అప్పన్న చందనోత్సవం  కార్యక్రమాన్ని  ఆదివారంనాడు నిర్వహించారు.   చందనోత్సవం  కార్యక్రమానికి  పెద్ద  ఎత్తున   భక్తులు వచ్చారు.  కానీ భక్తుల సంఖ్యకు అనుగుణంగా  ఏర్పాట్లు  చేయలేదు.   క్యూ లైన్లలో  గంటల తరబడి  ఉన్న భక్తులు   అధికారుల తీరుపై  మండిపడ్డారు. రూ. 1500  టిక్కెట్టు  కొనుగోలు  చేసిన వారు  కూడా  అప్పన్న దర్శనం   కోసం క్యూ లైన్లలో  ఐదారు గంటలకు పైగా  ఎదరు చూడాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి. 

  ఇవాళ తెల్లవారుజాము   3 గంటల నుండి  అప్పన్న నిజ రూప దర్శనం  ప్రారంభమైంది.  తెల్లవారుజాము నుండి  అప్పన్న దర్శనం కోసం  క్యూ లైన్లలో  భక్తులు  వేచి ఉన్నారు.    సింహాచలం  ఆలయం  ఘాట్  రోడ్డుపై వాహనాలు  నిలిచిపోయాయి.  దీంతో  భక్తులు   నడుచుకుంటూ  వెళ్లారు. కొండ కింది నుండి  పై వరకు  వాహనాలు నిలిచిపోయాయి. 

అప్పన్న నిజ రూప దర్శనం  కోసం  వచ్చిన  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను భక్తులు నిలదీశారు. మంత్రి  బొత్స సత్యనారాయణకు  వ్యతిరేకంగా  నినాదాలు  చేశారు.ఈవోకు  వ్యతిరేకంగా  పెద్ద పెట్టున  కేకలు వేశారు.  క్యూ లైన్లలో  ఉన్న భక్తులతో  మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  తాను కూడా  అప్పన్న దర్శనం కోసం  మూడు గంటల పాటు ఎదురు చూసినట్టుగా   మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. మంత్రి  బొత్స  సత్యనారాయణ భక్తులకు సర్ధి చెప్పే  ప్రయత్నం  చేశారు.  

ఆ తర్వాత   అప్పన్న దర్శనం  కోసం వచ్చిన  ఏపీ డిప్యూటీ  సీఎం  కొట్టు సత్యనారాయణ వచ్చారు.  ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో  భక్తులు వాగ్వాదానికి దిగారు.  అప్పన్న దర్శనం  కోసం  సరైన ఏర్పాట్లు  చేయలేదని  భక్తులు  చెప్పారు.  భక్తులతో  డిప్యూటీ సీఎం మాట్లాడారు.  పోలీసుల తీరుపై  ఏపీ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. భక్తులకు సర్ధిచెప్పే ప్రయత్నం  చేశారు.  

రూ. 1500, రూ. 1000, రూ. 300 టిక్కెట్లు  కొనుగోలు  చేసిన భక్తులకు  ఆలయ అధికారులు   స్లాట్  ను కేటాయించారు.  కానీ ఈ స్లాట్ మేరకు  భక్తులకు  దర్శనం  కల్పించలేదు.  దీంతో  భక్తులు  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. వృద్దులు, పిల్లలు  క్యూ లైన్లలో ఇబ్బంది పడ్డారు.  

also read:ఆచారాలను మంటగలిపారు: అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర ఫైర్

భక్తుల రద్దీ  పెరగడంతో  సిహాచలం  అప్పన్న  అంతరాలయ దర్శనాన్ని  అధికారులు రద్దు  చేశారు.  అయితే  అంతరాలయ దర్శనం  రద్దు చేయడంపై  భక్తులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios