మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయననే అరెస్ట్ చేయడంపై నారా లోకేష్ స్పందిస్తూ పోలీసులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
అమరావతి: వైసీపీ అరాచక పాలన, మైనింగ్ మాఫియా, అవినీతి-అక్రమాలు-ఆగడాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దేవినేనిపై దాడిచేసిన నిందితులను ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు... ఉల్టా ఆయనపైనే వైసీపీ సెక్షన్ల కింద కేసులుపెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
''బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో వుండటం దురదృష్టకరం. ఒక మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే..సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
''చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ! తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్కి పట్టిన గతే మీకూ తప్పదు.. కొద్దిగా టైము పడుతుందంతే. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నా...న్యాయం ముందు దోషులుగా నిలబడక తప్పదు'' అని పోలీసులను హెచ్చరించారు లోకేష్.
read more దేవినేని ఉమ హత్యకు కుట్ర... అందులో భాగమే దాడి: మాజీ మంత్రి యనమల సంచలనం
''కొండపల్లి ఫారెస్టులో అక్రమ మైనింగ్ తో వేలకోట్లు కొల్లగొట్టిన వసంత వీరప్పన్ బండారం బయటపెట్టారని, నిర్వాసితుల పక్షాన నిలిచి సర్కారుని నిలదీస్తున్నారనే కక్షతో..సజ్జల నాయకత్వంలో దేవినేని ఉమ గారిపై వైసీపీ రౌడీమూకలు దాడిచేయడం రాష్ట్రంలో అరాచక పాలనకి పరాకాష్ట'' అని లోకేష్ ఆరోపించారు.
''అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారని అధికారపార్టీ దేవినేని ఉమా గారిపై కక్ష కట్టింది. మాజీమంత్రిపైనే వైసీపీ గూండాలు దాడికి పాల్పడితే పోలీసులు ఏమయ్యారు? చట్టం ఎవరి చుట్టమైంది? ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? జగన్ స్వామ్యమా? డిజిపి సమాధానం చెప్పాలి'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
