111 ఏళ్ల బామ్మకు పుట్టిన రోజు వేడుకలు జరిపిన 5 తరాల వారసులు..
ఓ బామ్మ 111 పుట్టిన రోజు వేడుకలను గుంటూరు జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టిన రోజు వేడుకల కోసం 5 తరాలకు చెందిన 97 మంది గ్రామానికి రావడంతో పండగ వాతావరణం నెలకొంది.
నేటి కాలంలో ఎంత మంది నిండు నూరేళ్లు బతుకుతారు ? ఈ ప్రశ్నకు జవాబు ఎవ్వరూ జవాబు సరిగా చెప్పలేరు. ఎందుకంటే ప్రస్తుతం మనషుల జీవిత కాలం సగటు చాలా తగ్గిపోయింది. 60 నుంచి 65 ఏళ్ల వచ్చే సరికే చతికలపడిపోతున్నారు. ఎన్నో రోగాలు శరీరాన్ని ఆవహిస్తున్నాయి. 40-45 ఏళ్లు దాటిందంటే బీపీలు, షుగర్ లు వచ్చేస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ (technology) వల్ల తగ్గిన శారీరక శ్రమ, తినే ఆహారం, మారిన జీవన విధానమే ప్రస్తుత ఈ పరిస్థితికి కారణం.
100 ఏళ్ల పాటు జీవించి ఉండే వారు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా 110 ఏళ్ల దాటినా ఎంతో హుషారుగా ఉంటోంది. ఎవరి సాయం లేకుండా తన పనులు తాను చేసుకుంటోంది. ఐదు తరాల వారసులను చూస్తూ ఆనందంగా జీవిస్తోంది. ఇటీవలే ఆ బామ్మకు నిండటంతో ఆమె వారసులు ఆమెకు 111 ఏళ్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీలోని గుంటూరు (guntur) జిల్లాలోని పడమటి పాలెం రాజవోలు ప్రాంతం ఈ కన్నుల విందు వేడుకకు వేదికైంది.
పడమటి పాలం రాజవోలు (padamati palem rajavolu) గ్రామానికి చెందిన వెంకట సుబ్బమ్మ (venkata subbamma) శతాధిక వృద్ధురాలు. 110 ఏళ్ల నుంచి 111వ వసంతంలోకి కాలుపెట్టిన ఈ బామ్మకు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా సాగాయి. 5 తరాల వారసులందరూ ఈ పుట్టిన రోజుకు వచ్చి బామ్మతో కేక్ కట్ చేయించారు. ఈ బామ్మకు మొత్తం తొమ్మి మంది పిల్లలు. ఇందులో 6 గురు కుమారులు ఉండగా.. మిగిలిన నలుగురు కుమార్తెలు. వీరంతా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా గ్రామంలో కాకుండా ఇతర చోట్ల ఉంటున్నారు. వారికి పిల్లలు పుట్టి, మనవళ్లు కూడా ఉన్నారు. బామ్మ పుట్టిన రోజు వేడుకల కోసం వాళ్లంతా గ్రామానికి తరలివచ్చారు. దీంతో గ్రామం మొత్తం సందడి నెలకొంది. చుట్టాలు, స్నేహితులను అందరినీ ఆహ్వానించి ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు.
వెంకట సుబ్బమ్మ కుటుంబానికి చెందిన 97 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. కుమారులు, కూమార్తెలు, అల్లుళ్లు, కోడళ్లు, మనుమండ్లు, మనుమరాండ్లు, వాళ్ల భార్యలు, భర్తలు, ఇలా ఎంతో మంది ఈ వేడుక కోసం ఒక్క చోట కలుసుకున్నారు. ఇంత మంది కుటుంబ సభ్యులను చూసి బామ్మ ఎంతో ఆనందించారు. బామ్మ జీవనవిధానం, తినే ఆహారం వల్లే ఆమె ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు కూడా తన పనులు తాను చేసుకోవడంతో పాటు ఇంటి పనుల్లోనూ కొంత సాయంగా ఉంటారంట. ఈ వేడుకల కోసం ఎక్కడెక్కడో సెటిలైన వారంతా గ్రామానికి తిరిగిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.