ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు డెక్కన్ క్రానికల్ పత్రిక సారీ చెప్పింది. మంత్రి రోజా జనసేనాని పవన్ కళ్యాణ్ను సన్నీ లియోన్తో పోల్చిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పలు పత్రికలు కథనాలు రాశాయి. అయితే అందులో ఓ పొరపాటు దొర్లింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ క్షమాపణలు చెప్పింది. తప్పు జరిగిందని చెబుతూ వివరణ ఇచ్చింది. జనసేనా అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ మంత్రి రోజా సెల్వమణి.. సన్నీలియోన్తో పోల్చారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా సన్నీ లియోన్ స్పందించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వచ్చింది. సన్నీ లియోన్ పేరిట ఉన్న ఆ అకౌంట్ నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందించడంతో నిజంగానే సన్నీ లియోన్ స్పందించారని చాలా మంది భావించారు.
కానీ, ఆ ట్విట్టర్ హ్యాండిల్ నిజంగా సన్నీ లియోన్ది కాదు. దానికి బ్లూ టిక్ లేదు. అది వెరిఫైడ్ హ్యాండిల్ కాదు. కానీ, మంత్రి రోజా వ్యాఖ్యలపై మాత్రం సన్నీ లియోన్ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సోషల్ మీడియా వరకే పరిమితం కాలేదు. మీడియాలోకీ పాకింది. పలు పత్రికల్లోనూ దీనిపై కథనాలు వచ్చాయి. డెక్కన్ క్రానికల్లోనూ ఓ కథనం ప్రచురితం అయింది.
Also Read: Target 2024: రేపు విపక్షాల భేటీ, ఎల్లుండి ఎన్డీయే కూటమి భేటీ.. ఏ కూటమిలో ఎన్ని పార్టీలు?
ఆ తర్వాత అది ఫేక్ ట్వీట్ అని తేలింది. నిజంగా అది సన్నీ లియోన్ ట్విట్టర్ హ్యాండిల్ కాదని తెలియవచ్చింది. కానీ, అప్పటికే పలు కథనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే డెక్కన్ క్రానికల్ తాను చేసిన తప్పిదాన్ని గుర్తించింది. అంతేకాదు, హుందాగా వ్యవహరిస్తూ మంత్రి రోజాకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సారీ అని చెప్పింది.
వైసీపీ సీనియర్ నేత, మంత్రి రోజా సెల్వమాణి గురించి ఓ ఫీచర్ స్టోరీ లో తప్పుగా రాసినందుకు చింతిస్తున్నామని డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ ట్వీట్ చేశారు. ఆ పేరడీ అకౌంట్ ట్వీట్ను సరిగా పరిశీలించాల్సింది కానీ, అలా చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు, ఇది ఇక్కడితో ఆగి పోవాలని ఆశిస్తున్నానని, రోజా గారు సారీ అంటూ ట్వీట్ చేశారు.
