అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని అత్తను చంపిన కోడలు
మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలసిపోతున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలితీసేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని అత్తను అతికిరాతకంగా హత్య చేసిందో కోడలు.
గుంటూరు: మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలసిపోతున్నాయి. క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలితీసేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని అత్తను అతికిరాతకంగా హత్య చేసిందో కోడలు. వృద్ధాప్యంలో ఆదుకోవాల్సింది పోయి కర్కశంగా ప్రాణాలు తీసేసింది. మానవత్వానికి మాయని మచ్చగా మారిన ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరంలో చోటు చేసుకుంది.
మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో కోయ సరోజనమ్మ, వీరయ్య దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు వీరాంజనేయులు. వీరాంజనేయులకు తొమ్మిదేళ్ల క్రిత పిడుగు రాళ్ల మండలం గుత్తికొండకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది.
ఏడేళ్లపాటు ఎంతో ఆప్యాయంగా ఉన్న కుటుంబంలో కలతలు చెలరేగాయి. అత్త కోడల్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత గొడవలు. దీంతో వీరాంజనేయులు దంపతులు ఒక ఇంట్లో వెనుక భాగంలో తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే కోడలు విజయలక్ష్మీ తమ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధాన్ని గుర్తించిన అత్త కోడలను వారించింది.
మూడు నెలల క్రితం పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టడంతో విజయలక్ష్మీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. 20 రోజుల క్రితం మళ్లీ అత్తవారింటికి వచ్చింది. రోజువారీగానే వీరాంజనేయులు, విజయలక్ష్మీలు పొలం వెళ్లి ఇంటికి వచ్చారు. వీరాంజనేయులు మాచవరం వెళ్లిన తర్వాత అత్తకోడలు మధ్య గొడవ మెుదలైంది. కోపంతో విజయలక్ష్మీ అత్తను రోకలిబండతో విచక్షణ రహితంగా తలపై మోది హత్య చేసింది.
ఇంటికి వచ్చిన వీరాంజనేయులు రక్తపు మడుగులో ఉన్నతల్లిని చూసి కుప్పకూలిపోయాడు. తల్లి మరణంపై భయంతో కేకలు వేయగా స్థానికులు వచ్చి చూడగా అప్పటికే సరోజనమ్మ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్నసత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి, పిడుగురాళ్ల రూరల్ సీఐ సుబ్బారావు, స్థానిక ఎస్సై జగదీష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ముసలి వయస్సులో అత్తకు కూతురై ఆమె భాగోగులు చూడాల్సిన కోడలు ఇలా మృత్యువుగా మారి ప్రాణాలు తియ్యడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.