శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్లో ఉన్న దళిత వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే నిందితుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం ఇది లాకప్డెత్ అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు అర్దరాత్రి నుంచి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్లో ఉన్న దళిత వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే నిందితుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం ఇది లాకప్డెత్ అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు అర్దరాత్రి నుంచి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. జిల్లాలోని కొమ్మువలసకు చెందిన మహేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి కొన్ని నెలల కిందట సుంకరిపేటలో వీఆర్ఏగా పనిచేస్తున్న శ్రీదేవితో వివాహం జరిగింది. అయితే మూడు రోజుల కిందట శ్రీదేవి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే మహేష్ వేధింపుల కారణంగానే శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ పేరుతో మహేష్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మంగళవారం సాయంత్రం పోలీసు స్టేషన్లో మహేష్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు.
రాత్రి 8 గంటల తర్వాత మహేష్ మృతిచెందాడని పోలీసులు సమాచారం ఇచ్చారని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ పేరుతో పోలీసులు వేధించడంవల్లే మహేష్ మృతి చెందాడని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్లో అసలు ఏం జరిగిందనేది చెప్పాలన్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు స్టేషన్ సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
