ఉత్తరరాంధ్రకు భారీ వర్షాలు పొంచివున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం సోమవారం అర్థరాత్రి తీవ్రవాయుగుండంగా మారి.. మంగళవారం ఉదయానికి ‘‘తిత్లీ’’ తుఫానుగా మారింది

ఉత్తరరాంధ్రకు భారీ వర్షాలు పొంచివున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం సోమవారం అర్థరాత్రి తీవ్రవాయుగుండంగా మారి.. మంగళవారం ఉదయానికి ‘‘తిత్లీ’’ తుఫానుగా మారింది..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. గంటకు 8 కి.మీ వేగంతో కదులుతూ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీల దూరంలోనూ.. ఏపీలోని కళింగపట్నానికి 730 కి.మీల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. బుధవారినికి ‘‘తిత్లీ’’ తుఫాను కాస్తా.. పెను తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.

దీని ప్రభావంతో ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్‌పూర్ జిల్లాలు.. ఏపీలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ‘‘తిత్లీ’’ తుఫాను పశ్చిమవాయువ్య దిశగా కదిలి ఒడిశాలోని గోపాల్‌పూర్, ఏపీలోని కళింగపట్నం తీరాల మధ్య ఈ నెల 11వ తేదీ ఉదయానికి తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు నాలుగేళ్ల క్రితం ‘‘హుధుద్’’ తుఫాను నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.