ఏపి రాజధాని వివాదం... హైకోర్టులో సిపిఎం కౌంటర్ అఫిడవిట్
రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని... రాజధాని విషయం కేంద్రం తమకు సంబంధంలేదని చెప్పటం సమంజసం కాదంటూ ఏపీ హైకోర్టులో సిపిఎం కౌంటర్ దాఖలు చేసింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపిఎం పార్టీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేరుతో హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలయ్యింది.
''రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోంది. రాజధాని విషయం కేంద్రం తమకు సంబంధంలేదని చెప్పటం సమంజసం కాదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను నిర్ణయించింది కేంద్రమే. రాజధాని నిర్మాణాలకు కేంద్రం రూ.2 వేల 500 కోట్ల నిధులు కేంద్రం ఎలా ఇచ్చింది'' అని సిపిఎం అఫిడవిట్ లో పేర్కొంది.
''ఇప్పటికే రాజధాని కోసం వేల కోట్లను ఖర్చు చేశారు కాబట్టి రాజధాని తరలింపు యోచనను ఏపీ ప్రభుత్వం విరమించుకోవాలి. లేకుంటే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్ ఏం కావాలి. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది'' అని సిపిఎం పేర్కొంది.
''రాజధాని తరలింపు ఆలోచన ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారు. ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదు'' అని హైకోర్టులో దాఖలుచేసిన కౌంటర్ అఫిడవిట్లో సీపీఎం పేర్కొంది.