షర్మిల పార్టీ వల్లే జలజగడాలు:: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలనం
వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ప్రారంభమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ వివాదానికి రాజకీయంగానే పరిష్కారం లభిస్తోందన్నారు.
ఒంగోలు: వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ప్రారంభమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.బుధవారం నాడు ఆయన ప్రకాశం జిల్లాలో సీపీఐ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి వివాదంపై కూర్చొని చర్చించుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ పరిష్కారం వల్లే ఈ రకమైన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టులకు వెళ్లడం వల్ల చాలా సమయం పట్టనుందన్నారు.
ఏపీ రాజధానిపై మంత్రి గౌతం రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నట్టుగా ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చాక రాజధానిపై వైసీపీ సర్కార్ మాట మార్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతికి వైసీపీ సానుకూలంగా ప్రకటించిందని నారాయణ గుర్తు చేశారు.
కేంద్రంపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందన్నారు. మోడీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదన్నారు.34 మంది కేంద్ర మంత్రులపై రేప్, మర్డర్ కేసులున్నాయని నారాయణ ఆరోపించారు.