ప్రేమ పేరిట వేధింపులు... నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమెను అతి దారుణంగా హతమార్చాడు ఓ సైకో
విజయవాడ: ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడటమే కాకుండా ఆమెను అతి దారుణంగా హతమార్చాడు ఓ సైకో. అంతేకాకుండా తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిపాలయ్యాడు.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో ఓ యువతి కోవిడ్ కేర్ సెంటర్లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆసుపత్రి సమీపంలో స్నేహితులతో కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని వుంటోంది. అయితే ఆమెను గతకొంతకాలంగా ప్రేమ పేరుతో నాగభూషణం అనే యువకుడు వేధించేవాడు. యువతికి ఇష్టం లేకున్నా తన ప్రేమను అంగీకరించాలని వేధించేవాడు.
అతడి వేధింపులను తట్టుకోలేక యువతి నాలుగురోజుల క్రితం పోలీసులను ఫిర్యాదు చేసింది. దీంతో గవర్నర్ పేట పోలీసులు అతన్ని పిలిచి హెచ్చరించడమే కాకుండా ఇకపై ఆమె జోలికి వెళ్లనని ఒప్పుకున్నట్లు రాతపూర్వకంగా తీసుకున్నారు.
దీంతో ఇక అతడి పీడ విరగడయ్యిందని యువతి భావించారు. కానీ అతడు మరింత ప్రమాదకరంగా మారతాడని ఊహించలేకపోయింది. తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించిందన్న కోపంతో యువతిపై కోపాన్ని పెంచుకున్న నాగభూషణం సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా దాడికి పాల్పడ్డాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ నుు ఆమెపై పోసి నిప్పంటించాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిని యువతి అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అతడు కూడా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అతడు జీజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు.