కరోనా మహమ్మారి కాదట... కేవలం టైఫాయిడ్, ఫ్లూలా కామన్ అట..: జగన్ పై చంద్రబాబు ఫైర్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ముఖ్మమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు.
మంగళగిరి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ ఆదివారం ''జనతా కర్ఫ్యూ''ను అందరూ పాటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. టిడిపి ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లాల నేతలు కరోనా మహమ్మారి, స్థానికసంస్థల ఎన్నికలపై ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజురోజుకూ తీవ్రతరమవుతున్న కరోనాను ఎదుర్కోడానికి ప్రజలే కాదు నాయకులంతా సిద్దంగా వుండాలని చంద్రబాబు సూచించారు.
''స్వల్పకాలంలో 177దేశాలకు కరోనా విస్తరించింది. 10వేల మందిపైగా కరోనాతో మృతి చెందారు. కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి.10ఏళ్ల పిల్లలు, 65ఏళ్ల వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. కరపత్రాలు, బుక్ లెట్స్ పంపిణి చేయాలి'' అని నాయకులకు సూచించారు.
''స్థానిక ఎన్నికల్లో వైసిపి అక్రమాలపై పోరాడాలి. ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు సేకరించాలి. వైసిపి బెదిరింపులపై ఎవిడెన్స్ లు సేకరించాలి. బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసికి పంపించాలి. నామినేషన్లు వేయలేక పోయినవాళ్లు అనేకమంది స్క్రూటినీలో బలవంతపు ఉపసంహరణలు అనేకం వున్నాయి. అభ్యర్ధులను బెదిరించి అనేకం ఏకగ్రీవం చేశారు'' అని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ : కరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమీక్ష..అప్రమత్తం కావాలి...
''గతంలో రెండుశాతం వున్న ఏకగ్రీవాలు 24%కావడమే ప్రత్యక్ష రుజువు. వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఈసి రాసిన లేఖలో ఈ అక్రమాలన్నీ పేర్కొన్నారు. వైసిపి దాడులు, దౌర్జన్యాలపై కేంద్రానికి పంపారు. అందుకే ఈసిపై కత్తికట్టారు. ఆయన కుటుంబాన్ని బెదిరించారు. ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యాలపై కోర్టులలో కేసులు వేయాలి. అటు ప్రజాక్షేత్రంలో ఇటు న్యాయక్షేత్రంలో పోరాడాలి'' అని చంద్రబాబు సూచించారు.
''ఎన్నికల చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకోవాలి. చట్ట నిబంధనలను అధ్యయనం చేసి విశ్లేషించాలి. ఏపిలో ఎన్నికల ప్రధానాధికారికే భద్రతలేదు. ఈసిని ముఖ్యమంత్రి, మంత్రులు బెదిరించారు.ఎన్నికలు వాయిదా వేశారనే వైసిపి అక్కసు. ఈసీపైనే దాడులకు పాల్పడే నైజం వైసిపి నేతలది. ఈసి కుటుంబ సభ్యులకే ఏపిలో రక్షణ లేదు.కేంద్ర బలగాలు ఈసికి రక్షణగా వచ్చాయి. ఈసి లేఖతో వైసిపి అక్కసు రెట్టింపైంది. టిడిపిపై అసత్య ఆరోపణలకు తెగబడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని నాయకులకు తెలిపారు.
''సిఎస్ లేఖలో కరోనా బెడద 4వారాలు లేదన్నారు. లేఖ రాసిన 4రోజుల్లోనే విద్యాసంస్థలు మూశారు. ఆలయాలు, సినిమాహాళ్లు బంద్ చేశారు. దీనిపై సీఎస్, సిఎం ప్రజలకు జవాబివ్వాలి. కరోనాపై ముఖ్యమంత్రి ఒకరకంగా మాట్లాడారు. మంత్రులు ఇంకోరకంగా మాట్లాడారు. అధికారులు తలోరకంగా కరోనాపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకరికొకరికి పొంతన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరేం మాట్లాడతారో, ఎవరేం చేస్తారో తెలీని దుస్థితి" రాష్ట్రంలో వుందన్నారు.
read more నిమ్మగడ్డ రమేష్ కుమారైనా తప్పించుకోలేరు: విజయసాయి రెడ్డి
''కరోనా అనేది రోగం కాదని సీఎం జగన్ అన్నారు. టైఫాయిడ్, ఫ్లూ లాగా కరోనా కామన్ అన్నారు. పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలతో నవ్వులపాలయ్యారు. ప్రజల ఆరోగ్యంతో వైసిపి చెలగాటం ఆడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు వచ్చింది. ఒక వ్యవస్థ విఫలమైతే, మరోవ్యవస్థ కాపాడుతుంది. అదే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం'' అని అన్నారు.
'' దేశంలో 4వ్యవస్థలను నెలకొల్పారు. లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా 4 వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలున్నాయి. ధర్మం నాలుగు పాదాల నడవాలనేది పెద్దలమాట...4 వ్యవస్థలపై ప్రజాస్వామ్యం నిలబడాలని మన రాజ్యాంగం చెప్పేది.జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యూడల్ పాలకులు వస్తారనే అనుమానంతోనే, మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థల ద్వారా కట్టుదిట్టం చేశారు'' అని అన్నారు.
''ఓటు అనేది పౌరుల ప్రాథమిక హక్కు. పోరాడి సాధించుకున్న హక్కు ఓటు. పోటీచేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నామినేషన్లు వేసే స్వేచ్ఛ అభ్యర్ధులకు ఉండాలి. పౌర హక్కులనే వైసిపి నేతలు కాలరాస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలకు బుద్ది చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి'' అని చంద్రబాబు టిడిపి నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.