ఏపీలో మరో రెండు కరోనా కేసులు: ఐదుకు పెరిగిన సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకరికి, రాజమండ్రిలో మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిద్దరు కూడా విదేశాల నుంచి వచ్చినవారే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. తాజాగా విజయవాడలో ఒక కేసు, కాకినాడలో మరో కేసు నమోదయ్యాయి.
ఆ రెండు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చినవారికి చెందినవే కావడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాకు చెందన ఓ వ్యక్తి లండన్ నుంచి హైదరాబాదుకు, అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చాడు. మరో వ్యక్తి ఫ్రాన్స్ నుంచి ఈ నెల 17వ తేదీన విజయవాడకు వచ్చాడు.
వారిద్దరకి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వారిని బోధనాస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వారిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో తిరిగారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
వారిద్దరి బందువులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వారికి చెందినవే.
పొరుగు రాష్ట్రం తెలంగాణలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులను మూసేశారు. విజయవాడ, హైదరాబాదు జాతీయ రహదారిని మూసేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.