కరోనా దెబ్బకు గుంటూరు మిర్చి యార్డు బంద్
కరోనాను దృష్టిలో ఉంచుకొని గుంటూరు మిర్చి యార్డును మూసివేస్తున్నట్టుగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
అమరావతి: కరోనాను దృష్టిలో ఉంచుకొని గుంటూరు మిర్చి యార్డును మూసివేస్తున్నట్టుగా ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
మంగళవారం నాడు అమరావతిలో ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ ను వాయిదా వేసినట్టుగా ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాధిని దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్టుగా ఆయన చెప్పారు.
ఈసెట్, ఎంసెట్ లాంటి పరీక్షల గడువు తేదీని పొడిగించినట్టుగా మంత్రి వివరించారు. ఏప్రిల్ మొదటి వారం వరకు ధరఖాస్తు గడువును పెంచామన్నారు.అంగన్ వాడీ వర్కర్లు గర్భిణీలు, చిన్నపిల్లలకు నేరుగా ఇంటికే సరుకులను అందిస్తామని చెప్పారు.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 338 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా మంత్రి తెలిపారు. అంతర్ జిల్లాల్లో రవాణాను అరికట్టేందుకు గాను నిషేధం విధిస్తున్నట్టుగా నాని స్పష్టం చేశారు. పలు వాహనాలను కూడ సీజ్ చేశామన్నారు.
Also read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో ఎంసెట్, ఈసెట్ ధరఖాస్తుకు గడువు పొడిగింపు
కరోనా కట్టడిలో సమాచార సేకరణలో వలంటీర్లు బాగా పని చేస్తున్నారని మంత్రి నాని ప్రశంసించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ నెల 29వ తేదీన రేషన్ ను అందిస్తామన్నారు. అంతేకాదు వెయ్యి రూపాయాల నగదును కూడ లబ్దిదారులకు అందిస్తామన్నారు.
అయితే రేషన్ సరఫరా చేసే సమయంలో బయోమెట్రిక్ మిషన్ పై వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడ బయటకు రాకూడదని మంత్రి కోరారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఐఎఎస్ కమిటీ పనిచేస్తోందని మంత్రి చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నా కూడ వైద్యులు చికిత్స నిర్వహించి నెగిటివ్ వచ్చిందన్నారు. ఆసుపత్రి నుండి ఆ యువకుడిని డిశ్చార్జి చేసినట్టుగా తెలిపారు.