ఏపీకి ప్రత్యేక హోదా ... కాంగ్రెస్ కట్టుబడే వుంది, అధికారంలోకి రాగానే అమలు : రాహుల్ గాంధీ
ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడే వుందన్నారు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ. కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు కలిశారు.
కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్ గాంధీకి అమరావతి జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధానిగా వుండాలని రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు రాహుల్. మరోవైపు పోలవరం నిర్వాసితులు రాహుల్ గాంధీని కలిసి.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం, అమరావతి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
రైతులు రాజధాని కోసం భూములిస్తే.. ఏపీ ప్రభుత్వం 3 రాజధానులు పెడతామని అంటోందన్నారు రాహుల్. బీజేపీ దేశాన్ని విభజిస్తోందని.. ద్వేషాన్ని సృష్టిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఉల్లి రైతులు ధర లేక ఇబ్బందుల్లో వున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని.. అధికారంలోకి వస్తే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతుల సమస్యలు చూస్తుంటే బాధగా వుందని రాహుల్ అన్నారు.
ALso REad:ఏపీకి అమరావతే ఏకైక రాజధాని.. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం: రాహుల్ గాంధీ
ఇక, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించింది. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జేడీ శీలం.. తదితర నేతలు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆదోని మండలం శాగి గ్రామంలో రాహుల్ బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆదోనిలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ మీడియాతో మాట్లాడనున్నారు.