వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అదే... నెరవేర్చేందుకు షర్మిల కాంగ్రెస్ లోకి : సుంకర పద్మశ్రీ
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు.
![Congress leader Sunkara Padmashri strong counter to YCP Sajjala Comments about Sharmila AKP Congress leader Sunkara Padmashri strong counter to YCP Sajjala Comments about Sharmila AKP](https://static-ai.asianetnews.com/images/01eabze52hmnbw60szrg1n1h8z/sunkara-jpg_363x203xt.jpg)
అమరావతి : స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వైసిపిని ఇరకాటంలో పెట్టింది. దీంతో ఎక్కడ ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి తమకు నష్టం చేస్తుందోనని వైసిపి నాయకత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వైసిపి ఆవిర్భావం నుండి గత అసెంబ్లీ ఎన్నికల వరకు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకుని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల ఎక్కడ ఆ పని చేస్తుందోనని భయపడిపోతున్న వైసిపి ముందుగానే వైఎస్సార్ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది. గతంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం, రిలయన్స్ సంస్థలు కుట్రపన్ని అంతమొందించాయన్న ప్రచారం ఆంధ్ర ప్రదేశ్ లో అలజడి సృష్టించింది... ఇప్పుడు దీన్నే వైసిపి అస్త్రంగా మార్చుకుంటోంది. తండ్రి చావుకు కారణమైన, కుటుంబసభ్యులపై కేసులు పెట్టి వేధించిన పార్టీలో షర్మిల చేరిందనే కామెంట్స్ వైసిపి నాయకులు చేస్తున్నారు.
వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. షర్మిల కాంగ్రెస్ చేరగానే మళ్లీ వైఎస్సార్ మరణాన్ని వైసిపి తెరపైకి తీసుకువచ్చింది... ఇది కేవలం రాజకీయ లబ్దికోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ సజ్జల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వైసిపిలో గుబులు మొదలయ్యిందని... ఎక్కడ అధికారం కోల్పోతామోననే భయంతోనే సజ్జల విషప్రచారం ప్రారంభించారని అన్నారు. వైఎస్ జగన్ లా అధికార దాహం షర్మిలకు లేదని... కేవలం ఎన్నికల కోసమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకుని ప్రజల ముందుకు వచ్చేరకం కాదన్నారు. గతంలో జగన్ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలకు కాంగ్రెస్ ను దూరం చేసాడన్నారు. ఇప్పుడు వైఎస్సార్ కూతురు షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో గతంలో వైసిపి కాంగ్రెస్ చేసినవన్నీ తప్పుడు ప్రచారాలేనని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. కాబట్టి మరోసారి వైఎస్సార్ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని పద్మశ్రీ ఆరోపించారు.
Also Read ఇదంతా చంద్రబాబు కుట్రనే.. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలుంటే ఇంతకాలం ఏం పీకారు? అధికారంలో వున్నది మీరేగా... ఎందుకు విచారణ చేయలేదు? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. ఇంతకాలం అధికారాన్ని ఇప్పుడు ఎన్నికలు రాగానే వైఎస్సార్ మరణం గుర్తుకు వచ్చిందా? అని నిలదీసారు. ఎంతో అభిమానించే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేదే వైఎస్సార్ చివరి కోరిక ... ఇది గుర్తించిన షర్మిల కాంగ్రెస్ పార్టీతో చేరారని సుంకర పద్మశ్రీ అన్నారు.
తండ్రి వైఎస్సార్ పేరును జగన్ సర్వనాశనం చేశాడని సుంకర పద్మశ్రీ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు సంపాదించాడని అన్నారు. కేవలం వైఎస్సార్ ఆస్తులకే జగన్ వారసుడు... ఆశయాలకు మాత్రం కాంగ్రెస్ వాదులే వారసులని పద్మశ్రీ అన్నారు.