నాడు పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు.. ఇవాళ పట్టించుకోవడం లేదు: ఆజాద్
ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన పార్టీ ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన పార్టీ ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు.
మంగళవారం నాడు రాజ్యసభలో జరిగిన ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలుపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ పార్టీ తరపున గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు.
ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు విపక్షంగా ఉన్న బీజేపీ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1947లో కోస్తాంధ్ర, రాయలసీమలు మద్రాసులో భాగంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.ఆనాడు హైద్రాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
ఏపీ ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆజాద్ చెప్పారు. విభజన సమయంలో తెలంగాణకు వనరులు దక్కాయని ఆజాద్ అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం ఏపీకి సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆజాద్ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.
నాలుగేళ్లు దాటినా కానీ ఏపీ రాష్ట్రానికి రెవిన్యూలోటును తీర్చలేదన్నారు. ఏపీ సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ఏపీ ప్రజల మనోభావాలు తమకు తెలుసునని చెప్పారు.