అందర్నీ తొక్కేశారు: పీవీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఎఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ నేతలను పీవీ నరసింహారావు తొక్కేశారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఎఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ నేతలను పీవీ నరసింహారావు తొక్కేశారని ఆయన ఆరోపించారు.
పీవీ నరసింహారావు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలుచేశారు. పీవీ నరసింహారావు పీఎంగా ఉన్న కాలంలోనే బాబ్రీ మసీదు కూల్చివేశారని... దీంతో ముస్లింలు కాంగ్రెస్ కు దూరమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే గాంధీ కుటుంబం పీవీని దూరం పెట్టిందన్నారు.
బాబ్రీ మసీదును కూల్చినందుకే పీవీని బీజేపీ నేతలు పొగుడుతున్నారని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై కూడ ఆయన విమర్శలు చేశారు. ప్రణబ్ కూడ పీవీ మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ను రాష్ట్రపతిని చేస్తే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సభకు వెళ్లి ఆయన భారతరత్న తెచ్చుకొన్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేయనందున ఆయనను బీజేపీ పొగడడం లేదని చిన్నారెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పది వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.