చంద్రబాబూ, జల్లికట్టును చూసి నేర్చుకో...
దావోస్ లో ఏముంది, తమిళనాడు దారిలో వెళ్తే
హోదా వస్తుంది,వైజాగ్ కు రైల్వే జోనూ వస్తుంది, బాబూ
జల్లికట్టు దారిలో వెళ్లితే సమస్యలన్నీ పరిష్కరామవుతాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చారు.
ప్రత్యేక హోదా వదలుకుని, పెట్టుబడులు పెట్టండని దావోస్ హోట్లల్లో కూర్చుని అందరిని బతిమాలుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఒక లేఖ రాశారు.
ప్రత్యేక హోదా, వైజాగ్ రైల్వేజనో, పోలవరం నిధులతో సహా విభజన చట్టంలో ఉండేవన్నీ ఎలా తెచ్చుకోవాలో జలికట్టు చూపిందని, తమిళనాడు ప్రజలు చక్కటి బాట వేశారని, ఆబాటలో నడవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.
వారు మూడు రోజులలో సాధించింది మనం మూడేళ్లయినా విభజన చట్ట అమలు విషయంలో ఎందుకు సాధించలేకపోతున్నాము. మనం ఏమయిన గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నమా, మనకు న్యాయంగా రావలసిన వి ఇవ్వవలసిన బాధ్యత కేంద్రం మీద లేదా? మనలో ఐక మత్యం లేదా?మనకు చిత్తశుద్ధి లేదా? మరి మనం మూడేళ్లుగా ఎందుకు మనకు రావలసి వాటి గురించి కేంద్రం మీద వత్తిడి తేకుండా, వారు విదిల్చినవిమాత్రమే తీసుకుంటున్నాము. ఒక సారి ముఖ్యమంత్రిగా అలోచించండని ఆయన కోరారు.
“జరిగిందానికి వగచి ప్రయోజనం లేదు. ఇప్పటికయినా కళ్లు తెరుద్దాం. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడటానికి కలసి కట్టుగా పార్టీలకు అతీతంగా కదలుదాం. ’సంఘీభవించి ఎంతటి కార్యాన్నయినా సాధించవచ్చ‘ అని నిరూపించిన తమిళసోదరులను ఆదర్శంగా తీసుకుని‘గడ్డిపరకలు సైతం వెంటిగా ఏర్పడి మదపుటేనుగను బంధించు చున్న వన్న’ మన తెలుగు కవి చిన్నయసూచి మాటలను స్పూర్తిగా తీసుకుని కదులుదాం రండి. కేంద్రం పైపోరాటం చేద్దాం. మనకు న్యాయంగా రావలసినవి సాధించుకుందాం. ఈ విధమయిన ఐకమత్యాన్ని మనం ఇప్పటికయినా ప్రదర్శించి మనకు రావలసినవి సాధించలేకపోతే భవిష్యత్తులో మనం చరిత్ర హీనులుగా మిగిలిపోవడమేకాకుండా, మన భవిష్యత్తరాలకు తీరని నష్టం చేసిన వారం అవుతు. గుర్తించండి.”
“రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈపోరాటం మీ నాయకత్వంలో జరిగితే, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు,టివి మాధ్యమాలు, యువత, విద్యార్థులు మీకు తోడుగా వుంటారు. ఈ నెలచివర్లో పార్లమెంటుసమావేశాలు ప్రారంభమవుతున్నందున, ఈ లోపు కార్యాచరణ ప్రకటించి వచ్చే పార్లమెంటు సమావేశాలలో మన హక్కులు సాధించి, సీమాంధ్ర హక్కులు సాధించి, మీరు సీమాంధ్ర ప్రజల గుండెల్ల చిరస్థాయిగా తిరుగులేని నాయకుడిగా నిలిచిపోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తా.”
దేశం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో జల్లికట్టు నిషేధం కేసు ఉన్నా, తమిళురంతా ఒక్కటి అందరి మెడలు వంచి తమ డిమాండ్ ను సాధించుకున్న విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా కెవిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచించారు.