ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.1,34,800 విలువైన చెప్పులు వేసుకుంటారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. రూ.1 లక్ష విలువైన పెన్నును జేబులో పెట్టుకుంటారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై విమర్శలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1,34,800 విలువైన చెప్పులు వేసుకుంటారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఆయన దాదాపు రూ. 1 లక్ష విలువైన మాంట్ బ్లాంక్ కంపెనీ పెన్ను ఉపయోగిస్తారని అన్నారు. అలాగే ఆయన రూ.5,499 విలువైన బాటిళ్లలోని నీటిని తాగుతారని తెలిపారు. మంగళగిరిలో ఉన్న ఉన్న టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు లీటరకు రూ.50 విలువ చేసే నీరు తాగుతున్నారని సాక్షి దినపత్రిక గందరగోళం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ఇప్పుడు సీఎం తాగే నీరు, చెప్పుల ధర, పెన్ను ధర ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. జగన్ వాడే బ్రాండ్లను పత్రికలో ప్రచురించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అప్పట్లో రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగారని కానీ నేడు లక్ష ముప్పై వేలకు పైగా విలువైన చెప్పులు వేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వేసుకొనే చెప్పుల బ్రాండ్ బెర్లుటి అని, వీటిని ప్రాన్స్ లో మొసలి చర్మంతో తయారు చేస్తారని చెప్పారు. చిన్నపుడు కుళాయి నీళ్లు తాగేవారని, కానీ ఇప్పుడు ఎంతో ఖరీదైన నీళ్లు తాగుతున్నారని, సీఎం చాలా ఎదిగిపోయారని అన్నారు.
ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో ఘటన
సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెంచేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని ఆనం ఆరోపించారు. ప్రజలు కట్టే ట్యాక్స్ ల నుంచి రూ. 3 లక్షలకు పైగా పేపర్ల కోసం వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారని తెలిపారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తన భార్య పత్రికకు రూ.500 కోట్ల అడ్వర్టైజ్ మెంట్లు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు కూడా సాక్షి పత్రిక కొనుగోలు చేయాలని టీ షాప్ ల వద్దకు వెళ్లి చెబుతున్నారని ఆరోపించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
దేశంలోని 9 చోట్ల జగన్ కు ప్యాలెస్ లు ఉన్నాయనే ఫొటో చూపిస్తూ.. ఈ ఇళ్లు అన్ని ఎవరివి అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఇవ్వన్నీ జగన్ కు చెందినవి కాకపోతే, ఆ ఇళ్లను తమకు అప్పగించాలని, వాటిలో తాము అనాథాశ్రమాలు నిర్వహిస్తామని అన్నారు. బాపట్ల లో మంగళవారం సీఎం జగన్ మాట్లాడినవన్నీ అబద్దాలే అని తెలిపారు.
Hyderabad: తనతో కలిసి లిక్కర్ తాగలేదని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య
2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సారిగా సీఎం అయిన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తి రూ.1.74 కోట్లని చెప్పారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2009 లో జగన్ ఆస్తి రూ.77.39 కోట్లకు పెరిగిందని తెలిపారు. 2011లో రూ.445 కోట్లకు చేరిందని అన్నారు. మళ్లీ 2014 లో రూ.413 కోట్లు, 2019లో రూ.510 కోట్లుగా ఉందని తెలిపారు. ఇంత త్వరగా ఆస్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఆయన దేశంలోనే ధనిక సీఎంగా ఇటీవల నిలిచారని తెలిపారు.
