Asianet News TeluguAsianet News Telugu

థర్డ్ వేవ్ హెచ్చరికలు... సన్నద్దంగా వుండండి: వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశం

కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్యారోగ్య శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో సన్పద్దంగా వుండాలని సీఎం జగన్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 

CM YS Jagan Review Meeting With Health Ministry Officers
Author
Amaravati, First Published Sep 8, 2021, 4:07 PM IST

అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కోడానికి సిద్దంగా వుండాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.  కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలన్నారు. కొత్త మందుల విషయంలో మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ప్రభావాలు ఉన్నవాటి వినియోగంపై దృష్టిపెట్టి అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు సీఎం జగన్. 

కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్యారోగ్య శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించారు అధికారులు. అలాగే థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతకు సంబంధించిన ప్రణాళికను సీఎంకు అందించారు. ఇప్పటికే  20,964  ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందుబాటులో ఉంచినట్లు, ఇంకా 2493 రావాల్సినవి వుందన్నారు. 27,311 ఆక్సిజన్‌ డి–టైప్‌ సిలిండర్లు అందుబాటులో వున్నాయని... 108 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యాయని సీఎంకు వివరించారు అధికారులు.  

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 14,452వున్నాయని... 10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసుల నమోదు శాతం జీరోగా వుందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది వున్నారని తెలిపారు. ఇక కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926,  ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 9,966వున్నారని తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా వుందని సీఎంకు అధికారులు తెలిపారు. 

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్‌ 92.50 శాతంగా వుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 70.69 శాతంగా వున్నట్లు తెలిపారు. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 684 మాత్రమేనని పేర్కొన్నారు. 18 దఫాలుగా ఇప్పటివరకు ఫీవర్‌ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 

50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 140 ఆస్పత్రులలో పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు... అక్టోబరు 6 నాటికి ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. 

READ MORE  ప్రభుత్వ జీవోలన్నీ ఈ గెజిట్‌లో: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 2,23,34,971 మంది వుండగా వీరిలో సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,31,62,815 మంది, రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 91,72,156 వున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వినియోగించిన మొత్తం వ్యాక్సినేషన్‌ డోసుల సంఖ్య 3,15,07,127వున్నట్లు తెలిపారు.  

ఇటీవల కేరళలో పర్యటించిన అధికారులు, వైద్యాధికారుల బృందం కోవిడ్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా శిశు మరణాలను తగ్గించాలని... దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని...చక్కటి విధివిధానాలను ఖరారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 

కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. పారామెడికల్‌ సిబ్బందికీ మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. 

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్నారు. రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైనా పరీక్షలు జరగాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులోకి ఉండాలని... అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 

హెల్త్‌డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలని... ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఒక వ్యక్తి వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఆ వివరాలు డాక్టర్‌కు వెంటనే అందుబాటులోకి వచ్చేలా విధానం ఉండాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా, విలేజ్‌ క్లినిక్‌నుంచి టీచింగ్‌ ఆస్పత్రి వరకూ ఎక్కడికి వెళ్లినా ... అక్కడ చేయించుకున్న పరీక్షల వివరాలు, చికిత్స వివరాల డేటా అప్‌లోడ్‌ కావాలన్నారు. దీనికి సంబంధించి మంచి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ బాబు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జేవియన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios