ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహనిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహనిర్మాణంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. సంబంధిత మంత్రితో పాటు అధికారులతో సమావేశమైన సీఎం ఓటిఎస్ (one time settlement) అమలు, గృహ నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ఓటీఎస్‌ పథకం అమలు, పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎం జగన్ (ys jaganmohan reddy) అందించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

22A తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓటీఎస్‌ (OTS) వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని... ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేసారు. ఓటీఎస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని... దీన్ని వినియోగించుకోవడం ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుందో చెప్పాలని సూచించారు. ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందమని... ఇష్టపూర్వకంగానే జరపాలని సూచించారు. 

read more ఏం చేయాలన్నా కష్టమే... దౌర్భాగ్యపు టీడీపీ, చంద్రబాబు వల్లే ఈ దుస్థితి: సజ్జల ఆగ్రహం

ఆ పథక లబ్దిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సీఎం తెలిపారు. రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని వెల్లడించారు. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలని ఆదేశించారు.

ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ ప్రభుత్వం పరిశీలించలేదని... దీంతో సుమారు 43వేలమంది అసలు, వడ్డీ కూడా కట్టారని గుర్తుచేసారు. ఇవాళ మాట్లాడుతున్న వారు అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అంటూ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని... ఇప్పుడు ఓటీఎస్‌ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని జగన్ తెలిపారు. అవసరాలకు తనఖా పెట్టుకోవడమే కాదు అమ్ముకునే హక్కుకూడా ఉంటుందన్నారు. ఓటిఎస్ ద్వారా పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని... ఈ అవకాశం వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టమన్నారు. ఓటీఎస్‌ పథకం పూర్తిగా స్వచ్ఛందం'' అని సీఎం జగన్ తెలిపారు. 

''డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయి'' అని సీఎం జగన్ స్పష్టం చేసారు.

read more Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై అక్కడ కూడా ఏటీఎంలు.. సీఎం జగన్ ఎం చెప్పారంటే..

''ఇక గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయి. వర్షాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చింది. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలి'' అని అధికారులను సీఎం ఆదేశించారు.

''ఇళ్లు క్వాలిటీతో కట్టుకునేలా చూడాలి. ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలి. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి. లేబర్‌ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లేఅవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి'' అని సీఎం జగన్ సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.