సీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ... ఆ పోస్టుల నియామకానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అమలుచేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం జగన్ కు అందించిన వైద్యారోగ్య శాఖ అధికారులు. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని... వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు సంబధించిన విధివిధానాలకు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు అందించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలతో వివరాలు అందించారు అధికారులు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వైద్య చికిత్సల వివరాలనూ అందించారు అధికారులు.
హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు సీఎం. ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్హబ్స్లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని జగన్ ఆదేశించారు.
''హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్హబ్స్ ద్వారా నెరవేరుతుంది. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలన్నారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్లో ప్రత్యేక దృష్టిపెట్టాలి. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ హెల్త్ హబ్ లో ప్రాధాన్యత ఇవ్వాలి'' అని సీఎం ఆదేశించారు.
read more మేం చెప్పిన ధరకే విక్రయాలు జరగాలి: సినిమా టికెట్ల వివాదంపై పేర్ని నాని వ్యాఖ్యలు
వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు వివరించారు అధికారులు. ఈ క్రమంలో ఆస్పత్రుల నిర్వహణ కోసమే ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టాలని సీఎం ఆదేశించారు. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను ఆ అధికారులు నిర్వహించాలన్నారు. సీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని... అలాగే రిసెప్షన్ సేవలు కూడా కీలకమన్నారు సీఎం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయన్నారు సీఎం జగన్.
అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలన్నారు. ఎవరు ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలన్నారు. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదని సూచించారు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్పోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వినయ్చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ మురళీధర్ రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.