ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్నారు. గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కపిల గోవుకు హారతినిచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం 5 గంటలకే మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నశ్వర-విష్వక్సేన, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఇక, 108 గుండాలు, 4 ఆగమనాలు, 500 మంది రుత్వికులతో.. ఈ అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించనున్నారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు.. అంటే ఈ నెల 17 వరకు ఈ యజ్ఞం సాగనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నేతృత్వంలో యజ్ఞం నిర్వహిస్తున్నారు.
