ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు : బరిలో టీడీపీ అభ్యర్ధి, అలర్ట్ అయిన వైసీపీ.. జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. విపక్ష టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గురువారం సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తమ అభ్యర్ధిని బరిలో నిలబెట్టడంతో వైసీపీ మరింత అలర్ట్ అయ్యింది. ఒక్క ఓటు కూడా వృథా కాకుండా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఓటింగ్ విషయంలో ఎమ్మెల్యేలకు ఓరియెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో నిలిపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ సోమవారం నామినేషన్ ధాఖలు చేశారు. టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న అనురాధ.. గతంలో విజయవాడ మేయర్గా పనిచేశారు.
ఇక, ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్తో సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ALso REad: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థి అనురాధ నామినేషన్ దాఖలు..
ఈ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశాారు.అయితే అసెంబ్లీలో వైసీపీకి భారీ బలం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అని అంతా భావించారు. అయితే ఈ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు బ్రేక్ పడింది.
రెబల్స్పై ఒత్తిడిలో భాగంగానే..!!
అయితే టీడీపీ అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా.. పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి దూరమయ్యారు. వారు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి.. ఎన్నికల సమయంలో విప్ జారీచేయాలని టీడీపీ భావిస్తుంది. అలాగే వైసీపీలోని అసంతృప్తులతో కూడా సంప్రదింపులు జరపాలనేది చంద్రబాబు వ్యుహాంగా కనిపిస్తోంది.