రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంగళవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సీఎం జగన్ బయలుదేరి.. సాయంత్రం 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుని.. సాయంత్రం 5.20 గంటలకు తాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకుంటారు. అనంతరం అలిపిరి వద్ద తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటల సమయంలో సీఎం జగన్ తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు.
అనంతరం రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఉరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని.. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్.. పెద్ద శేషవాహన సేవలో పాల్గొననున్నారు. రాత్రికి సీఎం జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు.
బుధవారం ఉదయం సీఎం జగన్ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు. తర్వాత తిరుమలలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్హౌస్ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రామ్కో సిమెంట్ ప్యాక్టరీకి వెళతారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డుమార్గంలోని తాడేపల్లిలో నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.