గేట్లకు గ్రీజు వేయలేదు కానీ.. మూడు రాజధానులు నిర్మిస్తారా?.. బాధ్యతలకు భయపడే సీఎం దిగిపోవాలి: చంద్రబాబు ఫైర్
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుంటే ఆయన అసెంబ్లీలో తన ముఖం చూడాలని అన్నారని, అదే సమయంలో సిగ్గు లేకుండా పెళ్లికి పోయారని మండిపడ్డారు. అన్నమయ్య గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని, ఆ గేటు సమస్య ఇప్పుడు వచ్చింది కాదని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయించలేని సీఎం మూడు రాజధానులు నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్లే 62 మంది మరణించారని, ప్రజల మరణాలకు కారకుడైన జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలని డిమాండ్ చేశారు.
అమరావతి: Andhra Pradesh ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)పై TDP చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫైర్ అయ్యారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని విమర్శలు చేశారు. జగన్ బాధ్యతలకు అతీతుడు కాదని, బాధ్యతలకు వెనుకడాతే లేదా భయపడితే ముఖ్యమంత్రిగా ఉండే అర్హతే లేదని అన్నారు. వరదలతో ప్రజలు జీవన్మరణ సమస్య ఎదుర్కొంటుండగా వారిని రక్షించే బాధ్యత సీఎం జగన్ది కాదా అని మండిపడ్డారు. ప్రజలు తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి వారి ప్రాణాలు తీస్తారా? అంటూ ఆగ్రహించారు. వర్షాలు పడి రెండుసార్లు వరదలు రావడంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయని, మళ్లీ వరద వస్తుందని వాతావారణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. కాబట్టి, విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలని చెప్పారు. జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాణ నష్టం జరిగిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్కు గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మిస్తారా? అని ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని, వాటికి మరమ్మతులు చేయించలేదని చంద్రబాబాబు ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే 62 మంది మరణించారని, వరదల్లో రూ. 6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట గేటు క్లోజ్ కాలేదని, నీరు వృథాగా పోయిందని తెలిపారు. ఈ సారి వరదలకు అదే గేట్ ఓపెన్ కాలేదని చెప్పారు. గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదని, ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్ల కోసమే నీటిని విడుల చేయలేదని ఆరోపించారు. అంతేకాదు, అన్నమయ్య ప్రాజెక్టు గేట్కు గ్రీజు కూడా వేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మిస్తారా? అని ఎద్దేవా చేశారు.
Also Read: ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోంది.. జగన్ పై కేంద్ర మంత్రి మురళిధరన్ కామెంట్స్
సీఎం జగన్ సొంత జిల్లాకు వెళ్లి ఏం చేశారని చంద్రబాబు అడిగారు. ఎవరు మాట్లాడకుండా బాధితులను ముందే బెదిరించారని, అసలు ప్రజల్ని చంపడానికి ఎవరు లైసెన్స్ ఇచ్చారని ప్రశ్నించారు. తిరుపతి తుమ్మలగుంట చెరువును క్రికెట్ స్టేడియం చేశారని, దీంతో పద్మావతి వర్సిటీ నుంచి ఆటో నగర్ వరకు వరద వచ్చిందని అన్నారు. రాయల చెరువు తెగి ఉంటే 35 గ్రామాలు నీట మునిగేవని చెప్పారు. వరదల్లో ఓ వ్యక్తి తొమ్మిది మందిని కాపాడే ప్రయత్నం చేయగా ఏడుగురిని కాపాడగలిగారని, వరదల పరిస్థితి అంత సీరియస్గా ఉంటే తమపై దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రజలు ఈ బాధలో ఉంటే అసెంబ్లీలో తన ముఖం చూడాలని సిగ్గులేకుండా సీఎం ఇక్కడే ఉన్నారని విమర్శించారు. బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులను పెట్టి ఓదార్పు చేస్తారా? అని అడిగారు.
ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులైన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హులని అన్నారు. ఒక్క నెల్లూరులోనే రూ. 2 వేల కోట్ల నష్టం జరిగిందని వివరించారు. ఈ ప్రభుత్వం ప్రాణాలకు రక్షణ కాదు కదా.. డెడ్ బాడీలను కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రం వరదల్లో ఉంటే.. ఆయన సిగ్గులేకుండా పెళ్లికి పోయాడని అన్నారు. విశాఖ విషాదంలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చారని, ఇక్కడా బాధితులకు కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.