ప్రేమోన్మాదానికి వరలక్ష్మి బలి... సీఎం జగన్ సీరియస్, హోంమంత్రి, డిజిపిలకు ఆదేశాలు
విశాఖపట్నంలో ప్రేమ పేరిట యువతిని వేధించడమే కాదు ఏకంగా ఆమెను నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన దుర్ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
అమరావతి: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన వరలక్ష్మి కుటుంబానికి వైసిపి ప్రభుత్వం అండగా నిలిచింది. కూతుర్ని కోల్పోయి తీవ్ర వేదనలో వున్న తల్లిదండ్రులకు రూ.10లక్షలు ఆర్థికసాయం అదించనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ ల నుంచి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ దారుణ హత్యతో బాధలో వున్న కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా వీలయినంత తొందరగా ఎక్స్ గ్రేషియా నగదు రూ.10లక్షలను ఆ కుటుంబానికి అంధించాలని అధికారులకు సూచించారు.
read more విశాఖలో ప్రేమోన్మాదం... యువతిపై కత్తితో దాడి, నడిరోడ్డుపై దారుణ హత్య
టీనేజ్ యువతులు మొదలు ప్రతి మహిళను దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం పోలీస్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు సీఎం. పలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సీఎం జగన్.
ప్రేమోన్మాది చేతిలో యువతి బలయిన ఘటనపై హోంమంత్రి సుచరిత కూడా సిరియస్ గా స్పందించారు. భాదితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభాతి తెలిపారు హోంమంత్రి. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి విషయం తీసుకున్న హోంమంత్రి...ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.