అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలి.. ట్యాబ్లో బైజూస్ కంటెంట్: సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాల విద్యాశాఖపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాల విద్యాశాఖపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. ఈ సమీక్ష సందర్భంగా నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించిన అధికారులు.. అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లను ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలని అధికారులను సూచించారు.
స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అని పరిశీలన చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని అన్నారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలి. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక నంబర్ను స్కూళ్లలో ప్రదర్శించాలని చెప్పారు. దీనిపై స్పందించిన అధికారులు 14417 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు.
వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని చెప్పారు. యూనిఫామ్స్ కుట్టు చార్జీలను విద్యాకానుక ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. స్కూళ్ల అభివృద్దిపై, నిర్వహణపై తరుచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగు నీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని మరోసారి సీఎం స్పష్టం చేశారు. వీటిపై ఎప్పకప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పారిశుద్ధ్య లోపం వల్ల, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలావరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎం జగన్ అన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసులు సందర్శించాలని.. నెలకోసారి ఏఎన్ఎం సందర్శిచాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకు సంబంధించి ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్ఓపీ తయారు చేశామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్లతో సహా ముగ్గురు సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయనున్నారు. వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. మండల స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం సూచించారు.
ఈ సందర్భంగా టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీని కూడా సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వం 5,18,740 ట్యాబ్లను కొనుగోలు చేయనుందని.. అన్ని ట్యాబ్ల్లో బైజూస్ కంటెంట్ ఉంటుందని చెప్పారు. క్లాస్ రూమ్స్ డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేశారు. దశలవారీగా వీటిని తరగతి గదుల్లో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.