వాక్సినేషన్ పై మరింత ధ్యాస పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
అమరావతి: కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలను సడలించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. 97 చోట్ల జరుగుతున్న 134 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనుల ప్రగతిని వివరించారు. 15వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు అధికారులు. రెండు నెలల్లోగా పూర్తి ఉత్పత్తి సామర్ధ్యంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఇక వాక్సినేషన్ పై మరింత ధ్యాస పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఉపాధ్యాయులకు వాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్ ఇవ్వాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్ ఇస్తున్నామని... వీరికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాధాన్యతల ప్రకారం, విభాగాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు వాక్సినేషన్ పూర్తి కావాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకూ వాక్సినేషన్ ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
read more ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు: సడలింపు సమయాలు ఇవీ....
ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎంకు వివరించిన అధికారులు. ఏపీలో రికవరీ రేటు 97.47 శాతంగా వుండగా...పాజిటివిటీ రేటు 3.66 శాతంగా వుందన్నారు. 5 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు వుందన్నారు. యాక్టివ్ కేసులు 35,325 వుంటే వారిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 6,542వున్నారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,364, హోం ఐసోలేషన్లో ఉన్నవారు 23,419. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 93.40 శాతం, ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 76.26 శాతం వున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు నమోదైన కేసులు 3670 కాగా గడిచిన 24 గంటలలో కేవలం 33 కేసులు నమోదైనట్లు తెలిపారు. మరణించిన వారు 295 కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు 2075 గా అధికారులు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్) ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ.బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లిఖార్జున, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
