అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. అపాచీ పరిశ్రమ రెండు దశల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ చెప్పారు. పరిశ్రమలో వచ్చే ఉద్యోగాల్లో 80శాతం మహిళలకే అని చెప్పారు. ఇక, అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఇక, తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ అంతకు ముందు.. పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు రోజా, పెద్దిరెడ్డిలతో ఇతరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో సీఎం జగన్ మొక్కను నాటారు.