11వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం... నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.
అమరావతి: కోవిడ్పై నిర్లక్ష్యం వహించవద్దని... నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలన్నారు. పిహెచ్సిలు, యుహెచ్పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జిజిహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా వుండాలన్నారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్–19, గ్రామ–వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు–గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
''కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదు. కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్ను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లెందుకు ప్రచారం చేయాలి. ఈ కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్లు వస్తే వెంటనే దానిపై స్పందించాలి'' అని ఆదేశించారు.
read more స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై స్పందించారు: బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
''ఫోన్ కాల్స్పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే మన పనితీరుకు అద్దం పడుతుంది. కాబట్టి కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్లు, జెసిలు ప్రతిరోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనేదానిని పరీక్షించాలి'' అని సూచించారు.
''ఆర్టిపిసిఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. జిల్లాల్లోని అన్ని ల్యాబ్లకు అవసరమైన పరికరాలను అందించడం జరిగింది. ఎక్కడా కిట్ లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదు. పాజిటీవ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లు వున్న వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్లో వుంచేలా చర్యలు తీసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు.
''కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరునెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చాం. మరో 11 వేల మంది ట్రైనీ నర్స్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి. అలాగే మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరాలి. దానిని కూడా కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలి'' అని సీఎం ఆదేశించారు.
''హోం ఐసోలేషన్లో వున్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేశాం. మెడికల్ ఆఫీసర్ ఫోన్లో 14 రోజుల పాటు పేషంట్కు అందుబాటులో వుండాలి. జాయింట్ కలెక్టర్లు ఈ హోం కిట్లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలి'' అంటూ ముఖ్యమంత్రి జగన్ వైద్యశాఖ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.