రాష్ట్రంలో కోవిడ్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

రాష్ట్రంలో కోవిడ్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు.

ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని జగన్ సూచించారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సీఎం సూచించారు.

Also Read:ఏపీలో ఎన్ 440కే పై గందరగోళం: సీసీఎంబీ ఏం చెప్పిందంటే

కోవిడ్ ఆస్పత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో ఉన్న సీసీసీలను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో కూడా సేవలందించాలని సూచించారు.

కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లో పౌష్టికాహారం ఆహారం, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌కేర్‌తో పాటు వైద్యులు కూడా నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ఆక్సీజన్ సరఫరా, నిల్వల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, కేంద్రం కేటాయింపుతో పాటు ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. ఆస్పత్రుల వద్ద 10 కెఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ ఆక్సిజన్‌ నిల్వలుండాలని, వీలైనంత త్వరగా ఈ ఏర్పాట్లు చేయాలని సూచించారు.