ప్రజల్ని ఎవరైనా దోచుకుంటే సహించను:సీఎం చంద్రబాబు
అన్ని రంగాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు చింతలపూడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బోయెగూడెంలో గ్రామదర్శిని -గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఏలూరు: అన్ని రంగాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు చింతలపూడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బోయెగూడెంలో గ్రామదర్శిని -గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో వినూత్న మార్పులు-చేర్పులు తీసుకువచ్చిందని చంద్రబాబు తెలిపారు. అందుకు నిదర్శనమే నరేగాలో ఏపీకి 10 జాతీయ అవార్డులు రావడమని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని అయినా సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారీతనంలేని పాలనను చూస్తే తమ ప్రభుత్వంలో జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తున్నామని తెలిపారు.అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులందరికీ న్యాయం చేశామని ప్రకటించారు.
చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని వాడవాడలా సిమ్మెంట్ రోడ్లు వేస్తామని.. గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం 10 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. 10 కోట్ల రూపాయలతో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 450 ఇళ్లు నిర్మించి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు. నూటికి నూటి శాతం సిమ్మెంట్ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చి లాభసాటి వ్యవసాయాన్ని అందిస్తామన్నారు. మరోవైపు ప్రజల్ని ఎవరైనా దోచుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు అండగా నిలిచారని సీఎం ప్రశంసించారు. ప్రతీరోజు 15లక్షల ఫోన్ కాల్స్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మొద్దని సూచించారు.