రేపు విజయవాడకు జస్టిస్ ఎన్వీ రమణ.. ఒకే వేదికపైకి సీజేఐ , సీఎం జగన్
సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు విజయవాడలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఆయన వేదికను పంచుకోనున్నారు.
సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే వేదిక మీదకు రానున్నారు. ప్రస్తుతం ఏపీ పర్యటనలో వున్న సీజేఐ.. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. ఆగస్ట్ 20న ఉదయం 7.40కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ కోర్టుల ప్రాంగణం వద్దకు చేరుకుని కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 1.10 నుంచి 2.00 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ల గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం 2.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి.
ALso Read:కొంత మందికే రాజ్యాంగ విధులు, హక్కులపై అవగాహన ఉండటం దురదృష్టకరం - సీజేఐ ఎన్వీ రమణ
ఇకపోతే.. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వున్న సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరుగుతుండటం విశేషం. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జస్టిస్ ఎన్వీ రమణను గౌరవ డాక్టరేట్తో సత్కరించనుంది.