మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడి కేసు... సెక్షన్లివే...
ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఫోర్జరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమపై ఐపిసి 464, 465, 468, 471, 505సెక్షన్ల కింద సిఐడి కేసు నమోదు చేసింది. .
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సీఐడి కేసు నమోదయ్యింది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఫోర్జరీకి పాల్పడ్డారని ఫిర్యాదులు రావడంతో ఐపిసి 464, 465, 468, 471, 505సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడి అధికారులు వెల్లడించారు.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన ఉమ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో సీఎం జగన్ తిరుపతి గురించి మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను ప్రదర్శించారు. తిరుపతికి రావడానికి ఎవరూ ఇష్టపడరంటూ జగన్ అభిప్రాయపడినట్లు సదరు వీడియోలో వుంది. అయితే ఇది మార్పింగ్ వీడియో అని వైసిపి లీగల్ సెల్ కర్నూల్ అధ్యక్షుడు సీఐడికి ఫిర్యాదు చేశారు.
READ MORE అరెస్టు భయం: అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్
ఎన్నికల సమయంలో మార్పింగ్ వీడియోలను ప్రదర్శిస్తూ ప్రజలను పక్కదారి పట్టించడానికి మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నాడంటూ మరికొందరు వైసిపి నాయకులు కూడా సీఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో దేవినేని ఉమపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐడి అధికారి రవికుమార్ వెల్లడించారు. ఫిర్యాదుదారులు దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియో క్లిప్పింగులనుతమకు అందించారని... దీని ఆదారంగా విచారణ కొనసాగిస్తామని రవికుమార్ పేర్కొన్నారు.