తీతలి తుఫాను: మోడీకి చంద్రబాబు లేఖ
తీతలీ తుఫాను నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
అమరావతి: తీతలీ తుఫాను నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తుఫాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అపారమైన నష్టం జరిగిందని, రూ.2,800 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆ లేఖలో చెప్పారు. వెంటనే రూ.1200 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు.
వివిధ రంగాల్లో జరిగిన నష్టాన్ని కూడా ఆయన వివరించారు వ్యవసాయ రంగంలో రూ.800 కోట్లు, విద్యుత్తు రూ.500 కోట్లు, పంచాయతీరాజ్ రూ. 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. రోడ్లు, భవనాలకు సంబంధించి రూ. 100 కోట్ల నష్టం జరిగినట్లు చెప్పారు. ఫిషరీస్ రూ.50 కోట్లు, హార్టీకల్చర్ 1000 కోట్లు, గ్రామీణ నీటి పారుదలలో 100 కోట్లు, ఇరిగేషన్ నష్టం రూ. 100 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇతర పంటలకు సంబంధించి రూ.800 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
విపత్తులు వచ్చినా ధైర్యంగా నిలబడి పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్, ఇప్పుడు తితలీ తుఫాన్లో ప్రాణనష్టాన్ని నియంత్రించగలిగామని చెప్పారు. పలాస, ఉద్దానం ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావాలని, ప్రతి గ్రామంలో తాగునీటికి జనరేటర్లు ఉపయోగించాలని ఆయన అధికారులకు సూచించారు.
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 196 గ్రామాలకు సంచార వైద్య వాహనాలను పంపాలని తెలిపారు. డయాలసిస్ సెంటర్లలో సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, నిత్యావసర సరుకులు, పాలు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.