కుప్పంలో భోగస్ ఓట్లతోనే చంద్రబాబు గెలుపు.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ధ్వజం..
కుప్పం నియోజకవర్గంలో 36వేల భోగస్ ఓట్లు ఉన్నాయని..వాటితోనే చంద్రబాబు గెలుస్తున్నారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విరుచుకుపడ్డారు.
చిత్తూరు : రాజంపేట ఎంపీ, లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని.. వాటితోనే చంద్రబాబు గెలుస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాష్ట్రాల కూడలిలో కుప్పం ఉండడం వల్లే అక్కడ బోగస్ ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉందన్నారు. నాలుగు మండలాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం బుధవారం కుప్పం నియోజకవర్గంలో జరిగింది. ఈ సమావేశం తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కుప్పం ప్రాంతవాసులకు సంబంధాలు ఉన్నాయని.. దీనివల్లే బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య రెండు లక్షలకు పైచిలుకేనని తెలిపారు. అయితే వీటిలో 1.83లక్షల మంది ఓటర్లు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లింక్ అయి ఉన్నారని అన్నారు. అనేక రకాలుగా ఆధార్ కార్డులతో లింక్ అయిన వారు వీరేనని తెలిపారు. ఇంకా 17% అంటే 36వేల మంది ఓటర్లను నియోజకవర్గంలో గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. ఈ 17శాతం ఓటర్లు ఎక్కడివారో, ఎక్కడున్నారో గుర్తించలేకపోతున్నారని తెలిపారు. దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు.. కుమార్ అనే వ్యక్తి రామకుప్పం మండలం విజలాపురంలో ఉంటున్నాడు. అతనికి విజలాపురంలో ఓటు హక్కు ఉంది. దీంతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణియంబాడీలోనూ ఓటు హక్కు ఉంది.
అలాగే కంగుంది గ్రామానికి చెందిన అమ్మనమ్మకు కంగుందితో పాటు.. విజలాపురం పంచాయతీలోనూ ఓటు ఉంది. వీరు రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ బోగస్ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్నారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని ఇలాంటి భోగస్ ఓట్ల మీద కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ తదితరులు కూడా ఉన్నారు.