ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రత్యేక హోదా తమ హక్కు అని, దానికి ఓ యూసీ కావాలని ఆయన అన్నారు. సోమవారం టీడీపి మహానాడులో ఆయన మాట్లాడారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వచ్చే ఎన్నికల్లో బిజెపికి గట్టి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం నమ్మకద్రోహం చేసిందని, హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని అన్నారు. జాతీయ స్థాయి నేతలు హుందాగా మాట్లాడాలని ఆయన బిజెపి నాయకులను ఉద్దేశించి అన్నారు. ఏది మాట్లాడినా చెల్లుతుందనే పద్ధతిలో మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. 

నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చామని చెబుతోందని, యూసీలు ఇచ్చిన నిధులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. నిధులు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. హోదా ఇవ్వకపోతే బిజెపికి తగిన పాఠం చెబుతామని అన్నారు. 

అమరావతికి సంబంధించిన యూసీలు పంపించలేదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అనడం సరి కాదని అన్నారు. మనలను దెబ్బ తీయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడిపిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ కు అసాధ్యమంటూ ఏదీ లేదని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే బాధ్యత మనందరిది అని ఆయన అన్నారు.