మోడి వ్యతిరేక పార్టీలతో సమావేశం
ప్రధాని నరేంద్రమోడి వ్యతిరేక పార్టీలతో చంద్రబాబునాయుడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మొదటిసారిగా చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు క్యాంపు వేస్తున్నారు. అందుకని సోమవారం రాత్రికే ఢిల్లీకి చేరుకుంటున్నారు.
మోడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్ వాది పార్టీ, బిఎస్పీ, జెడిఎస్, ఆమ్ ఆద్మీపార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి లాంటి పార్టీల అధినేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. గడచిన మూడున్నరేళ్ళుగా ఏపికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యుపిఏ ప్రభుత్వం చేసిన హామీలు, ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు.
అదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపైన కూడా మాట్లాడుతారట. అంటే ప్రధానంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ప్రధానమంత్రి కార్యాలయం ఎంటర్ టైన్ చేస్తున్న విధానం తదితరాలపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి చంద్రబాబు ప్రయత్నాలకు జాతీయ పార్టీల అధినేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.