పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు: చంద్రబాబు సీరియస్
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోతిరెడ్డిపాడుపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పందించారు.
గుంటూరు: ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోతిరెడ్డిపాడుపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పందించారు. అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హతే ముఖ్యమంత్రి జగన్ కు లేదని చంద్రబాబు మండిపడ్డారు.
టిడిపి పాలించిన ఐదు సంవత్సరాల కాలంలో 63 ప్రాజెక్టులకు గాను రూ. 63 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు స్ఫష్టం చేశారు. ఆ సమయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో రూ. 56,750 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కథలు చెప్పి ఒకటి రూపాయి కూడా నిరూపించలేకపోయారని అన్నారు.
''పోలవరంలో రూ.25 వేల కోట్లు అవినీతి జరిగిందని అన్నారు... దాన్ని కూడా నిరూపించలేకపోయారు. సత్యాన్ని అసత్యంగా చూపించాలని చూస్తే జగన్ కే రివర్స్ అవుతుంది.
జూన్ 10,2019 న పోలవరం 71.04 శాతం పూర్తయిందని చెప్పారు తర్వాత 66.74 శాతం అని చెప్పారు. పార్లమెంటులో కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు 67.09 శాతం అని చెప్పారు. 2020 కేశినేని నాని అడిగితే 69.54 శాతం పూర్తియిందని చెప్పారు. ఇది వైసీపీ అసత్యాలకు పరాకాష్ట'' అని విమర్శించారు.
read more విశాఖ మెట్రో పనులు... ఆలస్యానికి కూడా అదే కారణం: జగన్ తో అధికారులు
''గతంలో టిడిపి వేసిన అంచనాలు రూ. 55,580 కోట్ల అంచనాలనే ఈ ప్రభుత్వం కూడా కేంద్రానికి పంపించి డబ్బులు అడిగారు. అవినీతి జరిగుంటే రూ. 25 వేల కోట్లను ఎందుకు మినహాయిచలేదు? ప్రతీ సోమవారాన్ని పోలవరానికి కేటాయించుకుని 105 వారాలు కష్టపడి సమీక్షలు చేసి 71.74 శాతం పనులు పూర్తి చేశాను. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమ నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాం'' అని పేర్కొన్నారు.
'' గత 12 నెలల్లో పోలవరానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు ఈ ప్రభుత్వం. జగన్ చేతగానితనంతో పోలవరం హైడల్ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. ఆరోజు రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దు అని చెప్పాం. కానీ వినలేదు. 203 జీవో తీసుకొచ్చారు'' అంటూ మండిపడ్డారు.