ఆడపిల్లల జోలికి వస్తే.. ఉరిశిక్షే..
అధికారులకు సూచించిన చంద్రబాబు
ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే.. కఠిన శిక్షలు విధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 'ఆడబిడ్డలకు రక్షణగా...కదులుదాం' ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీల తో ఆడపిల్లల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారేమోననే భయం అందరిలో కలగాలన్నారు.
మంగళవారం ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై విషయాలు కూడా అధికారులతో చర్చించారు.
‘‘వర్షపాతం లోటు 11% ఉన్నా భూగర్భ జలమట్టం 2.4మీ. పెరిగింది. జలసంరక్షణ చర్యలు మరింత ముమ్మరంగా నిర్వహించాలి. పంటకుంటలు, కాంటూరు ట్రెంచింగ్ పనులు వేగవంతం చేయాలి. ఏప్రిల్లో రూ.750 కోట్ల నరేగా పనులు...మే నెలలో రూ.1,000 కోట్ల పనులు జరగాలి. ప్రతినెలా ఇదే వేగంతో చేస్తే రూ.10వేల కోట్ల వినియోగం సాధ్యమే. అకాల వర్షాలకు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. పంటనష్టం అంచనాలు నాలుగు రోజుల్లో పూర్తిచేయాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలి. ఏడాదికి 10లక్షల ఎకరాల్లో పండ్లతోటల సాగు పెరగాలి. ఉద్యాన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు విస్తరించాలి. పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రాణనష్టం జరగకుండా చూడాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.