గురువుకు పంగ నామాలు పెట్టారు: మోడీపై బాబు
ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారని ... ఈ విషయమై నిలదీస్తే మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను ఏనాడూ యూ టర్న్ తీసుకోలేదన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసం రైట్ టర్న్ తీసుకొన్నట్టు చెప్పారు.
విజయవాడ: ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోడీ మోసం చేశారని ... ఈ విషయమై నిలదీస్తే మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను ఏనాడూ యూ టర్న్ తీసుకోలేదన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసం రైట్ టర్న్ తీసుకొన్నట్టు చెప్పారు. మాట తప్పిన మోడీ మాత్రమే యూ టర్న్ తీసుకొన్నారన్నారాయన. గురువుకు పంగనామాలు పెట్టిన చరిత్ర మోడీది అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నాడు విజయవాడలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాబు పాల్గొన్నారు.
మట్టి, నీళ్లు ముఖాన కొట్టి ఏపీకి అన్యాయం చేశారని మోడీపై బాబు విమర్శించారు.రాష్ట్ర విభజన గాయాన్ని ప్రధాని మోడీ ఇంకా పెద్దది చేశారని చెప్పారు.
తిట్టడం సులభమన్నారు,కానీ పనులు చేయడం చాలా కష్టమన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం బీజేపీతో ఆనాడు పొత్తు పెట్టుకొన్నట్టు చెప్పారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ... మీరు కలిసి రావాలని హైద్రాబాద్ సభలో మోడీ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన హామీల కోసం 29 సార్లు ప్రధానమంత్రి చుట్టూ తిరిగినట్టు ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు ఇవ్వాలని కూడ బీజేపీ డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మోడీ సర్కార్ తప్పుడు విధానాలను అవలంభిస్తోందన్నారు. ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. మోడీ రాకపై నల్ల చొక్కా వేసుకొని నిరసన చెబుతున్నట్టు చెప్పారు.ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతోనే మోడీని క్షమించరన్నారు.
రాజకీయాల్లో మోడీ కంటే తాను సీనియర్నని బాబు చెప్పారు. గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తిని తానేనని బాబు గుర్తు చేశారు.
తల్లిని చంపి బిడ్డకు కూడ అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన మోడీ... తల్లిని కూడ చంపేశారని బాబు ఎద్దేవా చేశారన్నారు.
ఏపీపై పెత్తనం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గత ఎన్నికల సమయంలో 14 సీట్లు ఇస్తే కేవలం 4 సీట్లు గెలిచిందన్నారు. బీజేపీతో పొత్తు లేకపోతే ఇంకా 15 సీట్లు దక్కేవన్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అని బాబు విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం తన మీద ఉన్న నమ్మకంతో రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని చెప్పారు. రైతులకు ఉన్న విశ్వాసం మోడీకి లేదన్నారు.
దేశంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడానికి మోడీ కారణమన్నారు. బీజేపీకి జనం లేనందున... ఈ సభకు వైసీపీ జనాన్ని సమీకరిస్తోందన్నారు.మోడీ ఏపీ టూర్ను అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. కానీ, వైసీపీ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్పై ఉన్న కేసుల కారణంగా ఆయన మోడీ టూర్పై స్పందించడం లేదన్నారు. బ్యాంకుల నుండి రుణాలను తీసుకొని కొందరు విదేశాలకు పారిపోయారని చెప్పారు.
దేశానికి మోడీ దగాకోరుగా మారారని చెప్పారు. మోడీ దేశానికి వాచ్మెన్ కాదన్నారు. తనకు ఇష్టమైన వారికి దేశాన్ని దోచిపెడుతున్నారని చెప్పారు. రాఫెల్ కుంభకోణంపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
ఏపీ ప్రజలకు అన్యాయం జరిగింది, ఏపీ ప్రజల పొట్ట కొట్టారనే కారణంగానే టీడీపీ మహాకూటమిలో చేరిందని చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకొనేందుకు గాను అన్ని పార్టీలను కలిపానని చెప్పారు. మన గడ్డపైకి వచ్చి అబద్దపు మాటలను మోడీ చెబుతున్నారని చంద్రబాబునాయుడు చెప్పారు.
నేను పార్టీలు మార్చలేదు... పార్టీ కోసం కుటుంబమంతా పోరాటం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గోద్రా అల్లర్ల ఘటన తర్వాత వాజ్పేయ్ మోడీని సీఎం పదవి నుండి తప్పించాలని ప్రయత్నిస్తే అద్వానీ మోడీకి అండగా నిలిచారని చెప్పారు. కానీ, పార్టీలో సీనియరైనా అద్వానీ నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం పెట్టని అహంకారి మోడీ అని బాబు చెప్పారు.
మోడీ గో బ్యాక్ అంటూ అనేది ఢిల్లీలో ప్రధాని సీట్లో కూర్చోవడానికి కాదు... గుజరాత్ వెళ్లి మీ గ్రామంలో కూర్చోవాలన్నారు. ఏపీకి కేంద్రం లక్ష కోట్లు ఇవ్వాలన్నారు. లోకేష్ తండ్రి అంటూ నన్ను విమర్శించారు. తనకు సభ్యత ఉందన్నారు.
వ్యక్తిగతంగా ప్రధాని మాట్లాడినందునే తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు. యశోధాబెన్ భర్త మోడీ అంటూ ఆయన చెప్పారు. కనీసం భార్యకు కూడ మోడీ విడాకులు ఇవ్వలేదన్నారు.నా కుటుంబాన్ని చూసి నేను గర్వపడుతున్నట్టు చెప్పారు. తన రాజకీయం మీద తన కుటుంబం ఏనాడు ఆధారపడలేదన్నారు.
మీరు ఎంత మాట్లాడితే అంత తిప్పి కొడుతానని బాబు చెప్పారు. రేపు ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చిన హోదా ఇవ్వరా అని నిలదీస్తానన్నారు. ఇచ్చిన మాట కోసం పోరాటం చేస్తానని చెప్పారు.
సంబంధిత వార్తలు
మామను వెన్నుపోటు పొడవడంలో సీనియర్: బాబుపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు